విశాఖ: దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు.
2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది.