ఎంఎస్‌ఎంఈలు బాగుంటేనే.. రాష్ట్ర ప్రగతి 

రూ.1,168 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు తోడుగా రీస్టార్ట్‌ ప్యాకేజీ

మే 22న తొలి విడత రూ.450.27 కోట్లు, నేడు రెండవ దఫా రూ.512 కోట్లు విడుదల

ఏప్రిల్, మే, జూన్‌ మాసాల విద్యుత్‌ ఫిక్డ్స్‌ చార్జీలు మాఫీ చేశాం

ప్రభుత్వానికి అవసరమయ్యే 360 రకాల సామగ్రి 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే కొనుగోలు

గ్రామస్థాయిలో ఉద్యోగాల కల్పన ఎంఎస్‌ఎంఈల ద్వారానే సాధ్యం 

విశ్వసనీయతపై నమ్మకం కలిగించేలా అడుగులు వేస్తున్నాం

వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్స్‌ సెక్టార్‌ను ఆదుకుంటాం 

రీస్టార్ట్‌ రెండవ విడత బకాయిల చెల్లింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే ఆ పరిశ్రమలు వృద్ధి చెందడంతో పాటు పదిమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారని, వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్‌ఎంఈలదేనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను గట్టెక్కించేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా అండగా నిలిచామన్నారు.  దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతున్నానని, వచ్చే సంవత్సరం స్పిన్నింగ్‌ మిల్స్‌ సెక్టార్‌ను ఆదుకుంటామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత రాయితీ బకాయిలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు.

సీఎం ఏం మాట్లాడారంటే..

చెప్పిన మాట ప్రకారం.. ఇచ్చిన డేట్‌లోనే..
ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో దాదాపుగా 97,428 వేల యూనిట్లు ఉన్నాయో.. ఇందులో 72,531 సూక్ష్మ పరిశ్రమలు, 24,252 చిన్న పరిశ్రమలు, 645 మధ్య తరహా పరిశ్రమలు, మొత్తంగా 97,428 ఎంఎస్‌ఎంఈల ద్వారా 10 లక్షల మంది చిన్న చిన్న ఉద్యోగస్తులకు మేలు చేయడానికి ఈ కార్యక్రమం చేశాం. ఇచ్చిన మాట ప్రకారం గత నెల మొదటి విడతగా రూ.450 కోట్లు విడదల చేశాం. చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన డేట్‌ ప్రకారం రూ.512 కోట్లు రెండ దఫా రీస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. 

గత ప్రభుత్వం రూ.800 కోట్లపైచిలుకు బకాయిపడింది
చిన్న చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటేనే వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతారు.. నలుగురికి చిన్న చిన్న ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం తరువాత మూరుమాల గ్రామ స్థాయిలో ఉద్యోగాలు చూపగలిగేవి ఎంఎస్‌ఎంఈలు మాత్రమే. చిన్న చిన్న చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఎంఎస్‌ఎంఈల ద్వారానే జరుగుతుంది. ఈ పరిశ్రమలకు 2014–15 గత ప్రభుత్వ హయాం నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపుగా ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీలు సుమారు రూ.800 కోట్ల పైచిలుకు బకాయిలు ఉంటే ఇక వారు ఏ రకంగా నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుందనే ఆలోచనతో మొదలై.. మొత్తంగా వారికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీలు చెల్లించడం జరుగుతుంది. 

రూ.2 నుంచి రూ.10 లక్షల వరకు రుణసదుపాయం
కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు నడపలేని స్థితిలో వీరికి వెసులుబాటు కల్పించేందుకు రూ.188 కోట్ల ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లోని విద్యుత్‌ ఫిక్డ్స్‌ చార్జీలను మాఫీ చేశాం. ఇదొక్కటే కాకుండా ఏపీఎస్‌ఎఫ్‌సీ ద్వారా దాదాపుగా రూ.200 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరం ఉంటే దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీకి అంటే 6 నుంచి 8 శాతం వడ్డీలోపే రుణాలు ఇప్పించడం జరుగుతుంది. 

కొనుగోలు చేసిన సామగ్రికి 45 రోజుల్లోనే బిల్లులు 
ఈ రుణమొత్తానికి ఆరు నెలల పాటు మారిటోరియం ఇస్తూ ఆ తరువాత మూడేళ్లలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాం. వీరి నిలదొక్కుకునేందుకు ఇంకో అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిలో కనీసం 25 శాతం ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచే తీసుకోవాలని నిర్ణయించాం. అందులోనూ 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన పరిశ్రమల నుంచి, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని దిశా నిర్దేశం చేశాం. సేకరించిన వస్తువుల బిల్లులను 45 రోజుల్లో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

మంచి జరగాలని మనసారా కోరుకుంటూ..
వీటన్నింటి వల్ల ఈ సెక్టార్‌ నిలదొక్కుకుంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ చిన్న పరిశ్రమలు బాగుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగుపెడుతుందని నమ్మకంతో వీరికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ సంవత్సరంలో రూ.11 వందల కోట్ల పైచిలుకుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.827 కోట్ల బకాయిలు తీర్చడమే కాకుండా ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ను నిలబెట్టేందుకు రూ.11 వందల కోట్లతో అడుగులు ముందుకేస్తున్నాం.

రూ.4 వేల కోట్ల పైచిలుకు బకాయిలు పెట్టింది
గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపంలో పెట్టిన బకాయిలు ఎన్ని అని చూస్తే దాదాపుగా రూ.4 వేల కోట్ల పైచిలుకు బకాయిలు పెట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలు నడవలేవని బాగా తెలుసు కాబట్టే వారిని అదుకునేందుకు అడుగులు ముందుకేస్తున్నాం.  మనకున్న ఆర్థిక పరిస్థితుల మధ్య కూడా వీరికి తోడుగా ఉండేందుకు ఒక్కో సెక్టార్‌ను ఒక్కో సంవత్సరం తీసుకొని వాటికి సంబంధించిన బకాయిలు పూర్తిగా తీర్చేసి ఆ కంపెనీలు వారి కాళ్ల మీద నిలబడే ప్రక్రియను మొదలుపెట్టిస్తున్నాం. 

వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్స్‌ సెక్టార్‌
వచ్చే సంవత్సరం స్పిన్నింగ్‌ మిల్స్‌కు సంబంధించి సెక్టార్‌ను ఆదుకునేందుకు అడుగులు ముందుకేస్తాం.  స్పిన్నింగ్‌ మిల్స్‌లో కూడా దాదాపుగా రూ. 1000 కోట్ల పైచిలుకు పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. వచ్చే సంవత్సరం ఆ సెక్టార్‌ను కూడా ఆదుకుంటాం.

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో
ప్రభుత్వం ఏదైనా మాట చెప్పి.. ఆ మాటపై నిలబడితేనే ఏదైనా పరిశ్రమ, నూతన పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఉంటుంది. విశ్వసనీయత అనే పదం మీద నమ్మకం కలిగించే కార్యక్రమం కోసం అన్ని రకాలుగా ముందడుగులు వేస్తున్నాం. దీని వల్ల సంపూర్ణంగా మీకు మంచి జరగాలని, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయగలుగుతుంది. 
 

Back to Top