కోవిడ్‌–19ను సమర్థవంతంగా ఎదుర్కున్నాం..

ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌ విధానంతో ముందుకెళ్లాం

వలంటీర్లు, ఆశావర్కర్ల సాయంతో 44 సార్లు ఇంటింటి సర్వే చేయించాం

కోవిడ్‌ మరణాల రేటు దేశంలోనే ఏపీలో అత్యల్పం (0.63%)

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో వైద్యరంగ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

దావోస్‌: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌ విధానంతో ముందుకెళ్లామని, భారత దేశంలో కోవిడ్‌ మరణాల శాతం 1.21 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే అత్యల్పంగా మరణాలు నమోదయ్యాయని, ఏపీలో కోవిడ్‌ మరణాల శాతం 0.63 మాత్రమే ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఆరోగ్య వ్యవస్థ, కోవిడ్‌ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ``ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి అభివృద్ధి చెందిన నగరాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా లేవు. అయినప్పటికీ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో 44 సార్లు ఇంటింటి సర్వే చేయించాం. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చాం. 42 వేల ఆశా వర్కర్లను వలంటీర్లతో అనుసంధానం చేసి.. ఇంటింటికీ సర్వే చేయించి.. జ్వరంతో బాధపడే వారిని గుర్తించాం. రెండు సంవత్సరాల కోవిడ్‌ ప్యాండమిక్‌లో 44 సార్లు ఇంటింటి సర్వే చేయించాం. కోవిడ్‌ వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. మా ప్రభుత్వం వైద్యరంగంపై అత్యంత శ్రద్ధచూపింది. దేశంలో మరణాల రేటు 1.21 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు దేశంలోనే తక్కువగా నమోదైంది. కేవలం 0.63 శాతంగా కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి``. 

ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో
ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఏవైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందివ్వడమనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను సెంట్రిక్‌గా చేసుకుని ఏపీలో హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ని రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కల్గిన ఒక గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్‌గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాము. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయి. పీహెచ్‌సీలో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్తారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతారు.. వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా మారుతారు. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యంతోపాటు ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ డాక్టర్లకు తెలుస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది.

వైద్య వ్యవస్థ బలోపేతం
మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ హాస్పటిల్స్‌ చికిత్స అందిస్తాయి. ప్రతీ పార్లమెంటు యూనిట్‌గా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్‌ కాలేజీలు వస్తాయి. అక్కడ పీజీ స్టూడెంట్స్‌ ఉంటారు. వీళ్లంతా హెల్త్‌కేర్‌లో భాగమవుతారు. దీని ద్వారా హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ బలోపేతం అవుతుంది. 

మూడేళ్లలో
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌గా మెడికల్‌ కాలేజీలు ఉండటం వల్ల అన్ని చోట్ల హెచ్చుతగ్గులు లేకుండా వైద్యవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందు కోసం ఇప్పటికే రెండు బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్‌ నియంత్రణ కార్యాచరణ అమలు చేశామని సీఎం జగన్‌ తెలిపారు.

కమ్యూనిటీ హెల్త్‌ ఇన్సురెన్స్‌
కమ్యూనిటీ హెల్త్‌ ఇన్సురెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నంగా ఏపీలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ వార్షియ ఆదాయం కలిగిన 1.44 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య సాయం అందించాం`` అని సీఎం వైయ‌స్‌ జగన్‌ వెల్లడించారు.

Back to Top