రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం క్లారిటీ ఇవ్వాలి

మంత్రి సమాధానంపై బొత్స సీరియస్‌.. 

అమ‌మ‌రావ‌తి:  తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై చేసిన  వ్యాఖ్య‌ల‌పై ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం క్వారిటీ ఇవ్వాల‌ని శాస‌న‌ మండలిలో విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ  డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అంశంపై శాసనమండలిలో చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్లోజ్ డోర్ మీటింగ్‌లో చంద్ర‌బాబును ఒప్పించి రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను ఆపేశాన‌ని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌ట్టుబ‌ట్టారు. సభా సంప్రదాయాలకు అనుగుణంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి పొత‌న‌లేని స‌మాధానం ఇస్తున్నార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాయలసీమ నీటి హక్కులకు సంబంధించి కీలకమైన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సూచించారు. 

తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులపై కొనసాగుతున్న అనిశ్చితి రైతుల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మండలిలో తాము మాట్లాడుతున్న సమయంలో మైక్‌ సౌండ్‌ తగ్గించినట్లుగా అనిపించిందని బొత్స ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పించాలని కోరారు. రాయలసీమ ప్రాంత నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయ‌న‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Back to Top