ప్రకాశం: వైయస్ఆర్సీపీలో తామంతా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్లమేనని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాత మంత్రి వర్గంలో తామంతా రాజీనామా చేసిన తరువాతే తనకు అవసరమైన మంత్రి వర్గానికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరోసారి అవకాశం కల్పించారని తెలిపారు. అంతే తప్ప ఇతర కారణాలేవీ లేవు. బాలినేనితో నాకు ఎటువంటి విభేదాలు లేవని ఉద్ఘాటించారు. మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన వారికి భావోద్వేగాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి నిదానంగా సర్ధుకుంటాయి’ అని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘సీఎం వైయస్ జగన్ ఆలోచన ప్రకారమే మేము నడుచుకుంటాం. అవినీతికి తావుండకూడదు అనేది సీఎం వైయస్ జగన్ నినాదం. కేబినేట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం ఎప్పుడూ చెప్పలేదు. మొత్తం కేబినేట్ను మారుస్తానని ఆయన చెప్పినట్టు చంద్రబాబు అంటున్నారు.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు..? చంద్రబాబు ఏమైనా కేబినెట్లో ఉన్నారా..?. వైయస్ఆర్సీపీ కేబినెట్ మంత్రులమంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నామని తెలిపారు. చంద్రబాబులో అభద్రతాభావం ఏర్పడిందని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఒక జెండా.. అజెండా అంటూ ఏమీలేదు. పల్లకి మోయడమే ఆయన అజెండా. అందుకే ఆయన వైయస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటిన్నింటిని గుంపగుత్తగా వేరేవారికి అప్పచెబుతామనే సిద్దాంత ధోరణిని అవలంభిస్తున్నారు. దీనిని ఎవరైనా పార్టీ సిధ్దాంతం అంటారా?’ అని మంత్రి ఆది మూలపు సురేష్ ప్రశ్నించారు.