ఏపీఎల్‌ టీ20 లోగో, టీజ‌ర్‌ ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

జూలై 17న ఫైన‌ల్ మ్యాచ్‌కు సీఎంను ఆహ్వానించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్‌

తాడేప‌ల్లి: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ 20 టోర్నమెంట్‌ లోగోను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్, సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర ప్రీమియ‌ర్ టీ-20 లోగోతో పాటు  టీ 20 టీజర్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టోర్నమెంట్ నిర్వ‌హించ‌నున్నారు. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు సీఎంను ఆహ్వానించారు. 

ఐపీఎల్‌ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ వెల్ల‌డించింది. బీసీసీఐ నుంచి ఏపీఎల్‌ నిర్వహించేందుకు అనుమతులు పొందిన‌ట్టు అసోసియేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి, ట్రెజరర్‌ ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి, సీఈవో ఎం.వి.శివారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ టి.సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాల రాజు, టెక్నికల్‌ ఇంచార్జి విష్ణు     దంతు, వీరితో పాటు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top