మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నా..

మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు
 

అమరావతి: మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నాన‌ని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయ‌న మంత్రి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దివంగత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో ప్రారంభమైన జలయజ్ణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీలో అన్ని‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  అండగా ఉంటానన్నారు.

 పోల‌వ‌రం త్వ‌రిత‌గ‌తిన పూర్తి 

పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్‌.. ఏపీకి వరం. పోలవరంతో రైతులందరికీ మేలు జరుగుతుంది. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామ‌ని అంబ‌టి రాంబాబు చెప్పారు. పోలవరంపై అడ్డంకులను అధిగమిస్తాం. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి‌ పరిస్థితులు ఎందుకు వచ్చాయి. డయా ఫ్రమ్ దెబ్బతిన్న సందర్బాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. డయా ఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి  2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారు. చంద్రబాబు ధన దాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కూడా దీనికి ‌కారణం. చంద్రబాబు, ఉమలు ఈ జాతికి సమాధానం చెప్పాలని’’ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

Back to Top