ఉచిత విద్యుత్ నగదు బదిలీతో ఎవరికీ ఇబ్బంది ఉండదు

ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం

అమ‌రావ‌తి:  ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంతో ఎవరికీ ఇబ్బంది కలుగదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో డిస్కంలు పారదర్శకంగా వ్యవహరించేందుకు వీలవుతుందని తెలిపారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు..ఉచిత విద్యుత్ న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కంతో పగలు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వడానికి సాధ్యపడుతుందని చెప్పారు. తక్కువ ధరకే విద్యుత్ కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.

విద్యుత్ లోడ్‌పై స్ప‌ష్ట‌త వస్తుంది..

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే విద్యుత్ వినియోగంపై స్పష్టత వస్తుందని, విద్యుత్ లోడ్ ఎంత ఉందనేది అర్థమవుతుందని అజేయ కల్లం వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించే ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, వచ్చే రబీ సీజన్ నాటికి ఫీడర్లు అందుబాటులోకి వస్తాయని, తద్వారా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆస్కారం లభిస్తుందని అన్నారు. కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల విద్యుత్ కంపెనీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఉండవన్న హామీని ప్రభుత్వం ఇస్తుందని అజేయ కల్లం పేర్కొన్నారు.

Back to Top