తాడేపల్లి: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే నిరుపేదల పెన్నిధి, రైతు బాంధవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మనకు దూరమైపోయి 15 ఏళ్లు గడిచాయి. ప్రజల బాగు కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు వైయస్ఆర్. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ సెప్టెంబర్2, 2009న మన కళ్ల ముందు నుంచి దూరమయ్యారు. కోట్లాది మందిని కన్నీటి సంద్రంలోకి నెట్టి తాను కానరాని లోకాలకు చేరుకున్నారు. మన మధ్యన ఆయన భౌతికంగా లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి. వైయస్ఆర్ అమలు చేసిన ఎన్నెన్నో పథకాలతో బడుగు, బలహీన వర్గాల్లోని ప్రతి కుటుంబమూ లబ్ధి పొందాయి. కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి, వికలాంగుడు, మహిళ, నేతన్న, వృద్ధాప్య.. ఇలా అన్ని వర్గాలకు ఆయన చేసిన సేవలు అజరామరం. 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా ఆ మహానేత వైయస్ఆర్ ఎందరికో పునర్జన్మ ఇచ్చారు. ఆ మహామనీషి శ్రీకారం చుట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉన్నాడు. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. వైయస్ఆర్ చివరి మాటలిలా.. 'ముందు చెప్పకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో చెప్పాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అంత అడ్వాన్సు నోటీసు ఇచ్చాను. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడున్న సమస్యలేంటో ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అవుతాను. ముందే నేను ఎక్కడికెళ్తున్నానో చెబితే అక్కడ ఏమైనా తప్పులున్నా సరిచేసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలూ సరిగా పనిచేస్తున్నాయా, కరువు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పనులు లేకపోవడం గానీ, మంచినీళ్లు, పశుగ్రాసం లాంటి సమస్యలున్నాయా, రేషన్ కార్డులు, ఇళ్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనేవి చూస్తాను. ఇందిరమ్మ పథకంలో అందరికీ ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా కానివారు ఎవరైనా ఉన్నారా, కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా చూస్తా. బీదవాళ్లలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు లేకుండా ఉండకూడదు. పెన్షన్లు రానివాళ్లు ఎవరైనా ఉన్నారా.. అలాగే ఒకరికే రెండు పెన్షన్లు రావడం లాంటివి ఉన్నాయా అనేవి నేరుగా తెలుసుకోడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నా` అన్న ఆ మహానేత గొంతు మనకు వినిపించలేదు. ఆయనా కనిపించలేదు. కోట్ల మందిని కన్నీటి సాగరంలో ముంచి దివికేగిపోయారు రాజన్న. ఉదయం హెలికాప్టర్లో బయల్దేరిన రాజన్న... ఎంతకూ గమ్యం చేరకపోయేసరికి రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేసిన వారెందరో. కోట్ల మంది ప్రార్థనలు, పూజలను విధి పట్టించుకోలేదు. మహానేత ప్రయాణించిన హెలికాప్టర్ను పావురాలగుట్ట కబళించింది. పేద ప్రజల పెన్నిధిని మనకు దూరం చేసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా వైయస్ రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు. ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. రాజన్నప్రయాణించిన హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాలగుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాలగుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అందరూ మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖరరెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ యుగాన్నే చవిచూసింది. ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడన్న భరోసా జనానికి కలిగింది. రాజన్న అంటేనే కొండంత అండ అనుకున్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించన్లు ఇచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యారు. మహానేత పాలనలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎంతో ధైర్యంగా బతికారు. అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేరని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తామూ ఉండలేం అన్నారు. రాజన్న లేరని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకు వెళ్ళిపోయి 16 ఏళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది. సంక్షేమం, అభివృద్ధికి చిరునామా @ వైయస్ఆర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. అలియాస్ వైయస్ఆర్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైఎస్సార్.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చారు. ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలనే కేంద్రం, అనేక రాష్ట్రాలు చేపట్టాయి. వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైయస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైయస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్గా ప్రజల నాడి తెలిసిన వైయస్ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. సీఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 15 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పేద బిడ్డల చదువులకు పెన్నిధి.. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి.. దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. వైయస్ఆర్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వైయస్ఆర్దే. సంక్షేమ పథకాలే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 16వ వర్థంతి కార్యక్రమాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. వైయస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం, అన్నదానం, దుప్పట్లు, పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పల్లెపల్లెలో మహానేతను గుర్తుచేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహానేత వైయస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకు పలు సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైయస్ఆర్సీపీ శ్రేణులు సమయత్తమయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతకు నివాళులర్పించనున్నారు.