అమరావతి: ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందించిన ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ప్రజల విశ్వాసం నాపై బాధ్యతను ఇంకా పెంచింది. గవర్నెన్స్ అంటే ఏమిటీ.. గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా నా ప్రతి అడుగు వేస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నికల ఫలితాలపై వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం ఎప్పుడూ జరగలేదు. నాకు తెలిసి 25 ఎంపీ స్థానాలు మొత్తం వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకోవడం, 175 నియోజకవర్గాలకు దాదాపు 153పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం ఆంధ్రరాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం. ఈ విజయం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైంది. మీ అందరి ఎదుటకు వచ్చి నిల్చొని మాట్లాడగలుతానంటే నిజంగా అది నా అదృష్టం, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలని గర్వంగా చెబుతాను. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచింది. విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారు. విశ్వసనీయత లేని నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు చూపించారు. నాపై ఉన్న విశ్వాసంతో ఓటు వేశారు. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. 5 కోట్ల మంది ప్రజానీకంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అవకాశం దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం దేవుడి దయ, ప్రజల దీవెనలతో వచ్చింది. గవర్నెన్స్ అంటే ఏమిటీ.. గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేలా నా ప్రతి అడుగు వేస్తాను. మరోసారి నా మీద ఈ విశ్వాసం ఉంచినందుకు పేరు పేరునా ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. మొదటి సంతకం నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నా.. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాలు చూశా.. వారు చెప్పిన బాధలు విన్నాను. ఆ ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా.. నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నానని కచ్చితంగా హామీ ఇస్తున్నా.. ఒక్క సంతకం కాదు.. నవరత్నాలను తీసుకొచ్చే పాలన కచ్చితంగా ఇస్తా. ప్రమాణ స్వీకారం విజయవాడలోనే జరుగుతుంది. 30వ తేదీన జరుగుతుందని వైయస్ జగన్ అన్నారు.