బడ్జెట్ సమావేశాలకు వేళాయె

రేపటి నుంచి సమావేశాలు

14 రోజులు సాగే  అవకాశం

12న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న  మంత్రి బుగ్గన

అదే రోజు వ్యవసాయ బడ్జెట్

మరొక్క రోజులో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ గారితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన బీఏసీ సమావేశంలో ఇందుకు నిర్ణయం తీసుకున్నారు. 14 రోజులు సాగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు నిధుల కేటాయింపుల గురించి రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్టెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతుకు ముందు ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2019-20 సంవత్సారినికి సంబంధించి ప్రవేశ పెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లులపై చర్చ కొనసాగుతుంది. 
బడ్జెట్ లో రైతులకు పెద్దపీట
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏమేమి చేస్తామని మాటిచ్చారో అవన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు వడ్డీలేని పంట రుణాల హామీని నెరవేరుస్తోంది. పగటి పూట 9 గంటల ఉచిత కరెంటు అందించేందుకు చర్యలు చేపట్టింది. 2014 నుండి 2019 వరకూ అంటే గత ప్రభుత్వ హాయాంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు రూ.7లక్షలు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమౌతోంది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అన్నిటినీ అందుబాటులోకి తెస్తోంది. రైతుకు మద్దతు ధర అందించడమే కాదు, ప్రకృతి వైపరీత్యాలవల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని  హామీసైతం ఇస్తోంది. రేపటి బడ్జెట్ లో రైతు పథకాలకు భారీగా కేటాయింపులు జరగనున్నాయి. 
నవరత్నాలతో వెలుగులు
మద్యపాన నిషేధం, పించన్లు, డ్వాక్రా రుణ మాఫీ, అమ్మ ఒడి ఇలా నవరత్నాల్లోని ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వాల తీరుగా కాకి లెక్కలతో కాదు, ప్రతిపథకానికీ ప్రయోజనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెల్టు షాపులకు అల్టిమేట్టం జారీ అయ్యింది. ఇక మద్యం దుకాణాల టెండర్లు 18% పడిపోయాయి. విచ్చలవిడిగా మద్యం లభించకుండా టైమ్ కటాఫ్ విధిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం నష్టం జరిగినా ప్రజారోగ్యమే ప్రగతి మార్గం అని నమ్మిన ముఖ్యమంత్రి వల్లే ఇది సాధ్యం అవుతోంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులకే కాదు ఇంటర్ విద్యార్థులకు సైతం అమ్మ ఒడి వర్తింపచేసి జేజేలు కొట్టించుకున్నారు ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ వయసు తగ్గించడం, కొత్త పింఛన్లు సాంక్షన్ చేయడం జరుగుతోంది. నిరుద్యోగ భృతిని కూడా మూడు రెట్లు చేసి వారికి అండగా నిలచారు వైఎస్ జగన్. నవరత్నాల పథకాల కు కేటాయించే బడ్జెట్ పై కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు ఆర్థిక మంత్రి. 
విపక్షానికి అవకాశం
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల మైకులు కట్ చేసి ప్రజావాణిని వినిపించకుండా కట్టడి చేసిన చీకటి రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సభా సాంప్రదాయాలకు పెద్ద పీటవేస్తోంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి జరిపిన బీఏసీ సమావేశంలో ప్రతిపక్షానికి ప్రశ్నించేందుకు, చర్చించేందుకు కోరినంత సమయం ఇస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వయసులో చిన్న అయినా పరిణితిలో చంద్రబాబు కంటే గొప్పగా వ్యవహరిస్తున్నారంటూ యువ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు రాజకీయ ప్రముఖులు. కరువు, వ్యవసాయ రంగ దుస్థితికి కారణాల గురించి చర్చకు అధికారపక్షం అంగీకారం తెలిపింది. 

Back to Top