ఐదేళ్ల తరువాత ఏపీకి పండుగ

రేపు ఆంధ్రరాష్ట్ర ఆవతరణ 

రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్ణయం

హర్షం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రజలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కి ఐదేళ్ల తరువాత పండుగొచ్చింది.  గత ఐదేళ్లుగా ఏపీ ఫార్మేషన్ డే అన్నది లేకుండా పోయింది. దాంతో ఆంధ్రులు ఓ విధంగా అవమానపడ్డారు, ఆత్మన్యూనతాభావానికి గురి అయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణా దర్జాగా జూన్ 2న  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూంటే ఏపీలో గత పాలకులు విస్మరించారు.   పొట్టి శ్రీరాములు పొరాడి సాధించిన ఆంధ్రరాష్ట్రానికి ఒక పుట్టిన రోజు అంటూ ఉందని ఇపుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్ చాటి చెబుతోంది. నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఓ పండుగలా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.  ఆంధ్రుల ప్రత్యేకతను వివరించే రోజుగా మళ్ళీ చరిత్రలోకి ఎక్కనుంది 

  పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో ..
1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉండేది. కోస్తా , రాయలసీమ పెద్దల అంగీకారంతో శ్రీభాగ్ ఒప్పందం షరతుతో తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న తొలి భాషప్రయోక్త రాష్ట్రంగా ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది. ఆ తరువాత ఆంధ్రరాష్ట్రం , తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.  

వేడుకలకు భారీగా ఏర్పాట్లు
నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఆయా జిల్లాల్లో నిర్వహించే  వేడుకలకు ముఖ్యఅతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు హాజరవుతున్నారు.  రాష్ట్రావతరణ వేడుకల కార్యక్రమాలు నవంబరు 1వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభ మవుతాయి. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారు. హస్తకళలు, చేతి ఉత్పత్తుల ప్రదర్శన, జిల్లాకు ప్రత్యేకమైన వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లా ప్రగతిపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రులపాత్ర తదితర అంశాలపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.  పాఠశాల, కళాశాల విద్యార్థులకు రాష్ట్ర చరిత్ర, స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రుల పాత్ర తదితర అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఈ బాధ్యతలు జిల్లా విద్యాశాఖ అధికారి, వృత్తి విద్యా అధికారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  వేడుకల నిర్వహణకు ప్రభుత్వం రూ.5 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Read Also: దగా..వంచన, మోసానికి మారుపేరు చంద్రబాబు

Back to Top