తాడేపల్లి: దగా, వంచన, మోసానికి చంద్రబాబు మారుపేరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే కుల చిచ్చు పెట్టడం అలవాటైందని తెలిపారు. లోకేష్కు తన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదని, ముందు టీడీపీని చక్కదిద్దుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని భావించి చాలా మంది ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరిపోతున్నారని తెలిపారు.టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ..రాజకీయాల్లోకి ప్రజల కోసమే వచ్చానని చెప్పారని గుర్తు చేశారు. ఆయన ప్రజల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. వ్యాపారాల పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు జీవితమే ఒక వంచన అని విమర్శించారు. పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు. మిమ్మల్ని జేబు దొంగ అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టకుండా, వ్యాపారం చేయకుండా రాజకీయాల్లో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఇవాళ నీతులు, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివే రోజు నుంచే విలువలు లేని రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు పక్షాన చేరి ఎలా విమర్శించావో అందరికి తెలుసు అన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచింది కూడా చంద్రబాబే అన్నారు. దేశంలో అతి నీచమైన, నికృష్టమైన రాజకీయ కుట్రలకు, వంచనకు, దగాకు మారు పేరు చంద్రబాబే అని ధ్వజమెత్తారు. ఆ తరంలో నరకాసురుడైతే..ఈ తరంలో నారాసురుడని అభివర్ణించారు. లోకేష్కు మందలగిరికి, మంగళగిరికి తేడా తెలియదని, జయంతికి, వర్ధంతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. నిన్న లోకేష్ చేసిన దీక్ష ఎలా ఉందంటే..పురాణాల్లో పుర్రెలు మెడలో వేసుకునే వారని, ఐదేళ్ల పాటు ఇసుక, మట్టి, రాజధాని భూములు, పోలవరం కాంట్రాక్టుల్లో మొత్తం దోచి నిన్న లోకేష్ దీక్ష చేసినట్లు ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా టీడీపీకి ఇచ్చినా వారిలో ఆత్మ పరిశీలన లేదన్నారు. టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదని, చరిత్రలో అంతరించే పార్టీ మీదన్నారు. దోచేదానికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో వైయస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటే..అలాంటి పాలన చేయలేకపోయామన్న చింతతో చంద్రబాబు, ఆయన కుమారుడు పోరాటం చేస్తున్నారని విమర్శించారు. సద్విమర్శలు చేయాలని, ఇలా కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే..రేపటి దినం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తండ్రీ కుమారులు మానసిక జబ్బుతో బాధపడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో వైయష్ జగన్ చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చుతున్నారని వివరించారు. జీవో నంబర్ 2430లో ఏముందని ఆయన ప్రశ్నించారు. నెపోలియన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పత్రికలపై మా నాయకుడికి గౌరవం ఉందన్నారు. కొన్ని పత్రికలు, చానల్స్ మంచిని చెడుగా చూపించే వార్తలు రాస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తలు రాసిన పత్రికలపై చర్యలు తీసుకునేందుకు గతంలోనే నిర్ణయాలు తీసుకున్నారని, మా ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు తీసుకుందన్నారు. గతంలో సాక్షి మీడియాను టీడీపీ ఏ సమావేశానికి అనుమతించలేదన్నారు. నిజాయితీగా వార్తలు రాసే మీడియా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ వార్తలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవాస్తవాలు, అసత్యాలతో కూడిన వార్తలు రాస్తే కేసు పెట్టవచ్చు అని సమాచారా శాఖకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. వాస్తవాలను రాయాలని మీడియాకు సూచించారు. Read Also: వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సీఎం సమీక్ష