►మహిళలు ముందడుగు వేయాలి. స్వతంత్రంగా తలెత్తుకుని బతకాలి!!. ►అన్నదాతకు విత్తు నుంచి ఎరువుల వరకూ అన్నీ ఊళ్లోనే ఇవ్వాలి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. పంట దెబ్బతింటే బీమాతో ఆదుకోవాలి!!. ►నిరుపేదకు సుస్తీ చేస్తే డబ్బుల్లేక వైద్యం దొరకదనే భయం ఉండకూడదు. ప్రభుత్వ వైద్యంతో పాటు తనకు కార్పొరేట్ వైద్యమూ ఉచితంగానే అందాలి!!. ►చదువే సమాజాన్ని నడిపిస్తుంది. బుద్ధి వికసించే ప్రీ స్కూలు నుంచి... కెరీర్ను నిర్ణయించే గ్రాడ్యుయేషన్ వరకూ విద్యార్థులకు వెన్నంటి ఉండాలి!.వాళ్లను వ్యవస్థకు దిక్సూచీలుగా మార్చాలి!!. ►ఇవే కాదు!. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలకు సైతం తగిన విధంగా చేయూతనివ్వాలి. ►మొత్తంగా చూస్తే గురువారం నాటి రాష్ట్ర బడ్జెట్లో కనిపించింది ఈ జన సాధికారతే!. అన్ని వర్గాలనూ ఆర్థికంగా స్వతంత్రులను చేయటం... గౌరవంగా బతుకు బండి లాగించేలా చూడటం. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం... అంతటి వయసూ లేకపోయినా జన సాధికారతకు మాత్రం సీఎం వైఎస్ జగన్ తిరుగులేని బాట వేశారు. అభివృద్ధి అంటే నాలుగు భవనాలు నిర్మించటం కాదని... నిన్నటి కంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటుందన్న భరోసా కల్పించటమేనని చెప్పిన సీఎం... దాన్ని ఆచరణలో చూపించారు. మహిళల సమానత్వాన్ని చేతల్లో చూపిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్రాత్మక అడుగేశారు. వరసగా రెండో ఏడాదీ కోవిడ్ అన్ని రంగాలనూ దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా... నవరత్నాలు గానీ, నూతనంగా అమల్లోకి తెచ్చిన పథకాలకు గానీ ఎక్కడా ఇబ్బం ది లేకుండా తగిన కేటాయింపులు చేస్తూ ఏకంగా రూ.2,29,779 కోట్లతో బడ్జెట్ను సమర్పించింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని ముఖ్యాంశాలు... రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధే లక్ష్యంగా 2021–2022 బడ్జెట్ను రూ.2,29,779.27 కోట్లతో రూపొందించింది. తొలిసారిగా జెండర్ బేస్డ్ బడ్జెట్ను తీసుకు వచ్చి సమాజంలో సగం ఉన్న మహిళలకు, పిల్లలకూ ప్రత్యేక కేటాయింపులు చేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, కాపుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. విద్య, వైద్య రంగానికి అగ్రతాంబూలం ఇస్తూ.. కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీ పడకుండా ముందుకు అడుగులు వేసింది. కోవిడ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో గురువారం ఒక్క రోజే బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగిపోయింది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా, మాట తప్పని నేతగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపించాయి. తొలి సారిగా మైనారిటీ యాక్షన్ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేస్తూనే వ్యవసాయం, విద్య, వైద్య, సాగునీటి మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన çహామీల్లో 95 శాతం పైగా నవరత్నాల పథకాల క్యాలెండర్ అమలుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. బడ్జెట్లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు ఏ ఏ వర్గాలకు ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా వివరించారు. కోవిడ్–19 వల్ల కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఏ పథకాన్ని విస్మరించకుండా, నిధుల్లో కోత పెట్టకుండానే విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. 2021–22 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. నవరత్నాల్లో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీకి తగినన్ని నిధులు కేటాయించారు. మహిళలు, పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీలకు ప్రత్యేక కేటాయింపులు తొలి సారిగా జండర్ బడ్జెట్ పేరుతో మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.47,283.21 కోట్లు కేటాయించారు. పిల్లలు, చిన్నారుల అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్లో రూ.16,748.47 కోట్లు కేటాయించారు. చేతి వృత్తుల వారికి ఇచ్చిన మాట మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్లో కొత్తగా మైనారిటీలకు యాక్షన్ ప్లాన్ పేరుతో రూ.3,840.72 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. బీసీ ఉప ప్రణాళికకు 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్లో 32 శాతం అధికంగా రూ.28,237.65 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఉప ప్రణాళికకు గత బడ్జెట్తో పోల్చితే ఈ బడ్జెడ్లో 22 శాతం అధికంగా రూ.17,403.14 కోట్లు కేటాయించారు. ఎస్టీ ఉప ప్రణాళికలో గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో 27 శాతం అధికంగా రూ.6,131.24 కోట్లు కేటాయించారు. కాపుల సంక్షేమం కోసం గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో 7 శాతం అధికంగా రూ.3,306 కోట్లు కేటాయించారు. అన్ని వర్గాలకు బాసట ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లు, అర్చకులకు, ఇమామ్లు, మౌజమ్లు, ఫాస్టర్లకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పేద వర్గాలకు వైఎస్సార్ బీమా వర్తింప చేసేందుకు నిధులు కేటయించారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో ఏకంగా రూ.17,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఇందులో రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.7,200 కోట్లు కేటాయించారు. వివిధ పథకాల ద్వారా రైతులపై వరాల జల్లు కురిపించారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలకు, ఉచింగా బోర్లు వేయడానికి, అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, పంటల బీమా ప్రీమియంకు బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చేశారు. విద్యా రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రూ.24,624.22 కోట్లు కేటాయించారు. ఇందులో మన బడి నాడు–నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు రూ.3,500 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తూ రూ.13,830.44 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు నాడు–నేడు కింద రూ.1,535.88 కోట్లు కేటాయించారు. జలయజ్ఞం, గృహ నిర్మాణానికి ప్రాముఖ్యత పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా గృహ నిర్మాణ రంగానికి బడ్జెట్లో రూ.5,661.57 కోట్లు కేటాయింపులు చేశారు. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.13,237 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి రూ.6,438 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంకు రూ.2,881 కోట్లు కేటాయించారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తంకు కేటాయింపులు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు, ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం కింద రూ.500 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ రూ.2,29,779.27 కోట్లు మొత్తం రూ.2,29,779.27 కోట్లతో 2021–22 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,82,196.54 కోట్లు ఉంటుంది. రుణాల చెల్లింపులతో కలిపి కేపిటల్ వ్యయం రూ.47,582.73 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం రూ.1,77,196.48 కోట్లు కాగా, కేంద్ర పన్నుల్లో వాటా రూ.26,935.32 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.57,930.62 కోట్లు వస్తాయని మంత్రి తెలిపారు. రెవెన్యూ లోటు రూ.5000.05 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.37,029.79 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వ్యవసాయ రంగం కుదేలైంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ అండతో వ్యవసాయ రంగం విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగింది. అన్నదాతకు, వ్యవసాయ రంగానికి అండగా నిలబడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కంటే మిన్నగా నిధులను కేటాయించింది. వరుసగా రెండో ఏడాదీ కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే.. ఈ కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గతేడాది కన్నా మిన్న కేటాయింపులు జరçపడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రకటించడమే కాకుండా.. వరుసగా మూడో బడ్జెట్లోనూ ఈ రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది. 2019–20లో రూ.28,866 కోట్లతో తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో కేటాయింపులను రూ.29,159.97 కోట్లకు పెంచింది. ఈ ఏడాది ఏకంగా రూ.31,256.35 కోట్ల కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లను అదనంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. గతేడాదితో పోల్చుకుంటే వ్యవసాయ, పశు సంవర్ధక, సహకార, పట్టు పరిశ్రమల శాఖలకు కేటాయింపులు భారీగా పెంచడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకూ నూతన జవసత్వాలనిచ్చింది. అన్నదాతలకు అగ్రతాంబూలం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద గతేడాది 51.95 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఈ పథకానికి రూ.6,976.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడతగా ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు జమ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు రూ.17,029.88 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించారు. వ్యవసాయ సబ్సిడీ కోసం టీడీపీ సర్కారు 2018–19లో రూ.2,138.22 కోట్లు ఖర్చు చేస్తే గతేడాది రూ.4,450 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.5 వేల కోట్లకు పెంచింది. ఉపాధి హామీతో అనుసంధానం.. వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా గతేడాది కంటే మిన్నగా ఈ ఏడాది కేటాయింపులు జరిపారు. గతేడాది వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ పథకం కింద రూ.6,270 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది ఏకంగా రూ.8,116.16 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం గతేడాది 207.83 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు కోసం రూ.739.46 కోట్ల కేటాయింపులు పెంచారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది మూడున్నర రెట్లు పెంచారు. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా రూ.1,802. 82కోట్లు కేటాయించారు. మత్స్య, పశు సంవర్థక శాఖలకూ భారీగా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పశు సంవర్థక, మత్స్య శాఖలకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా కేటాయింపులు జరిపారు. గతేడాది పశు సంవర్థక శాఖకు రూ.854.78 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.1,026.37 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 171.59 కోట్లను అదనంగా కేటాయించారు. మత్స్య శాఖకు గతేడాది రూ.299 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.329.48 కోట్లు కేటాయించారు. పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞాన బడి వంటి పథకాలకు కేటాయింపులు జరిపింది. పాల ఉత్పత్తి సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయింపులు పెంచింది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న సహకార శాఖకు గత బడ్జెట్లో రూ.248.38 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.303.04 కోట్లకు పెంచారు. రూ.68 వేల కోట్లు గత రెండేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ.68 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.17,029.88 కోట్లు, çసున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.573 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,252 కోట్లు, పంట నష్టపరిహారం కోసం రూ.1,038 కోట్లు, ధాన్యం కొనుగోలు కోసం రూ.18,343 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం రూ.4,761 కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.17,430 కోట్లు, విద్యుత్ ఫీడర్ ఛానళ్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం రూ.1,224 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కింద రూ.1,520 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చెల్లించాల్సిన వడ్డీ లేని పంట రుణాలు, పావలా వడ్డీ బకాయిలు రూ.688 కోట్లు, విత్తన బకాయిలు రూ.384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.716 కోట్లు, రైతుల ఎక్స్గ్రేషియా రూ.23 కోట్లు కలిపి మొత్తం రూ.2,771 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. విపత్తులో వెన్నుదన్ను! లాక్డౌన్లు, కర్ఫ్యూలున్నా దేశ మనుగడ కోసం నిరంతరం శ్రమించే అన్నదాతల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమివ్వడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పెట్టే పెట్టుబడినే ఆకలి, పేదరికంపై పోరాటానికి ఆయుధాలుగా భావిస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు మొత్తం రూ.31,256.36 కోట్ల కేటాయింపులతో 2021–22 వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాది కంటే అధికంగా నిధులు కేటాయించింది. నిత్యం స్వేదం చిందిస్తూ సేద్యం చేసే రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. గత సర్కారు మిగిల్చిన బకాయిలూ చెల్లించాం.. ►అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.68 వేల కోట్ల మేర సహాయం అందించింది. టీడీపీ సర్కారు మిగిల్చిన బకాయిలు రూ.2,771 కోట్లు కూడా చెల్లించింది. ► విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ కేంద్రాల్లో కొత్తగా 234 కేంద్రాలతో కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వివిధ ఉత్పత్తులను నిల్వ చేసి ఆర్బీకేలకు అందించేందుకు 154 హబ్లను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కోటి రూ.21.80 లక్షల చొప్పున మొత్తం 10,417 ఆర్బీకే భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ►వైఎస్సార్ పొలం బడుల ద్వారా రైతు సాధికారిత సాధిస్తున్నాం. 10,246 కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పాం. ► వైఎస్సార్ రైతు భరోసా కింద 2020–21లో 51.95 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు జమ చేశాం. 2021–22 తొలి విడత సాయంగా 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు ఇచ్చాం. ఇంతవరకు మొత్తం రూ.17,029.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ► విత్తనాల కోసం వ్యయ ప్రయాసలు, సుదూర ప్రయాణాలు, క్యూ లైన్లు, పోలీసుల పహారా లాంటి వాటికి ముగింపు పలికాం. రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. తొలిసారి టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి, శుద్ధి చేసి నాణ్యంగా మార్చి తిరిగి అన్నదాతలకే అందజేశాం. రైతులపై రూపాయి భారం లేకుండా... ► దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద ఏటా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న వారికి వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. తద్వారా 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ► రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని పంటల ప్రణాళిక రూపొందించేలా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి క్రియాశీలం చేశాం. ►రైతులకు వారి పొలాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు వైఎస్సార్ పొలంబడి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 2020–21లో నిర్వహించిన 18,840 పొలం బడులలో 5.65 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు. ►ఈ ఏడాది కొత్తగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, భూ సారాన్ని పరిరక్షించడం, సేంద్రీయ పద్ధతులు పాటించటాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) అమలు చేస్తున్నాం. ► విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను తనిఖీ చేసిన తరువాతే వినియోగించేలా వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలను వచ్చే ఖరీఫ్కి అందుబాటులోకి తెస్తాం. ► ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం చెల్లించే విధానాన్ని దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నాం. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. 2020 ఖరీఫ్లో జూన్ నుంచి అక్టోబరు వరకు పంటలు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285.51 కోట్లు పరిహారం జమ చేశాం. 2020 నవంబర్లో నివర్ తుపాను వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు వెంటనే డిసెంబర్లోనే చెల్లించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ► ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 462 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేశాం. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ఏడాది లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2019 నుంచి 2021 మే వరకు రూ.31,782 కోట్లతో 157 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. సీఎం యాప్ ద్వారా ధరల నమోదు.. ►సీఎం యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత ధరలు ఉన్నాయో నమోదు చేస్తున్నాం. రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతక కోసం ఇ–సంతకం విధానాన్ని ప్రవేశపెట్టాం. గోనె సంచులపై క్యూఆర్ ట్యాగులతో అనుసంధానించాం. ►దేశవ్యాప్తంగా వ్యాపారులతో మన గ్రామస్థాయి మార్కెట్లను అనుసంధానించేందుకు ‘ఇ–ఫార్మ్ మార్కెటింగ్’ వేదికను అందుబాటులోకి తెచ్చాం. ►మహిళా సాధికారికత కోసం మార్కెటింగ్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ► ప్రతి గ్రామంలో మార్కెటింగ్ మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 వేల కోట్లతో ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను నెలకొల్పుతున్నాం. ►వ్యవసాయ ఉత్పత్తులను పొలాల్లోనే కొనుగోలు చేసేందుకు పంట కోత ముందు, తరువాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,718.11 కోట్లతో బహుళార్ద సాధక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ►డీసీసీబీల్లో హెచ్ఆర్ పాలసీని తెచ్చి పీఏసీఎస్లను కంప్యూటరీకరిస్తున్నాం. ►సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ కింద చిత్తూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.609.39 కోట్లతో పనులు మంజూరు చేశాం. మొదటి ఏడాది 67 గిడ్డంగుల నిర్మాణంతోపాటు 44 పాత గిడ్డంగుల మరమ్మతులు, కార్యాలయాల నిర్మాణ పనులు చేపడతాం. ►ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం రూ.2,850 కోట్లతో ప్రణాళికను ఆమోదించాం. ►రూ.460 కోట్లతో 2020–25లో రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాం. ► ఉద్యానవన పంటల విస్తరణ పథకంలో భాగంగా ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో నూతన పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. ►బైవోల్టైన్ సెరీ కల్చర్ను ప్రోత్సహించేందుకు బైలోల్టైన్ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కిలోకు రూ.50 ప్రోత్సాహకం అందిస్తున్నాం. బైవోల్టైన్ ముడి పదార్థం నుంచి సిల్క్ రీలర్స్ ఉత్పత్తికి కిలోకు రూ.130 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నాం. ►పశువులకు గ్రాసం అందించేందుకు దేశంలో మన రాష్ట్రమే తొలిసారిగా రూ.250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ►రూ.40.86 కోట్లతో పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ►పాల సేకరణ, విక్రయంలో ప్రపంచంలోనే సహకార రంగంలో పెద్దదైన అమూల్ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నూతన అధ్యాయానికి తెరతీశాం. ఈ పథకం అమలవుతున్న గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పాడి రైతులకు అదనంగా రూ.5 నుంచి రూ.17 వరకు లబ్ధి చేకూరుతోంది. ►చేపలు, రొయ్యల దాణా, నాణ్యత పరీక్షలు, సేవలు అందించేందుకు రాష్ట్రంలో 9 తీరప్రాంత జిల్లాల్లో 35 సమీకృత ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు రూ.50.30 కోట్లు కేటాయించాం. ► ఆక్వా కల్చర్ రంగంపై పర్యవేక్షణ, నియంత్రణ, సుస్థిర అభివృద్ధి కోసం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించాం. ►పశ్చిమ గోదావరి జిల్లాల్లో షిషరీష్ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాం. n తీరప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మొదటి దశలో నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా)లలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ, ఉప్పాడ (తూర్పు గోదావరి), జువ్వలదిన్నె (నెల్లూరు)లలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చేపట్టాం. రెండో దశలో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం ), బియ్యపు తిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం (ప్రకాశం)లో హార్బర్ల నిర్మాణం చేపడతాం. ►వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ►వైఎస్సార్ జలకళ పథకం కింద నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు రూ.1,700 కోట్లతో మోటార్లను కూడా ఉచితంగా అందిస్తాం. దీంతో ఐదు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. బాలల కోసం స్పెషల్ బడ్జెట్ రేపటి పౌరులైన నేటి బాలల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక ముందడుగు వేసింది. ప్రాథమిక హక్కులు, బాలల సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపక్రమించారు. రాష్ట్ర బడ్జెట్లో పిల్లలకు తగిన ప్రాధాన్యమిస్తూ ‘పిల్లల బడ్జెట్’ను ప్రభుత్వం రూపొందించింది. 2021–22 వార్షిక బడ్జెట్లో వివిధ శాఖల ద్వారా 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఏకంగా రూ.16,748.47కోట్లు కేటాయించింది. బడ్జెట్లో పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేక నివేదిక రూపంలో ప్రభుత్వం వెలువరించింది. బాలల సర్వతోముఖాభివృద్ధికి మూడు కేటగిరీలుగా ఈ నిధులను కేటాయించారు. నేరుగా సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన/ఆర్థిక సహకారం, శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటగిరీలుగా నిధులు కేటాయించినట్టు నివేదికలో పేర్కొన్నారు. రెండు విభాగాలు.. 39 పథకాలు ► పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ పథకాలు, వాటికి నిధుల కేటాయింపు వివరాలను ప్రభుత్వం రెండు విభాగాల కింద తన నివేదికలో పేర్కొంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 పథకాలు ఉన్నాయి. ► మొదటి విభాగంలో 100 శాతం పిల్లల కోసం రూపొందించిన పథకాలకు కేటాయింపులను పొందుపరిచారు. ఆ పథకాల కోసం రూ.12,218.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పూర్తిగా పిల్లల కోసం కేటాయించిన 20 పథకాలను ఈ విభాగంలో చేర్చారు. ► రెండో విభాగంలో 100 శాతం కంటే తక్కువ నిధులను పిల్లల కోసం కేటాయిస్తూ రూపొందించిన పథకాలను పొందుపరిచింది. ఆ పథకాల కోసం ప్రభుత్వం రూ.4,529.83 కోట్లు కేటాయించింది. ఈ విభాగంలో 19 పథకాలను చేర్చారు. పాఠశాల విద్యా శాఖదే సింహభాగం ►పిల్లల బడ్జెట్ కేటాయింపుల్లో శాఖల వారీగా చూస్తే పాఠశాల విద్యా శాఖ మొదటి స్థానంలో ఉంది. ఆ శాఖకు రూ.8,228.67 కోట్లు కేటాయించారు. ► రూ.3,314.90కోట్ల కేటాయింపులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రెండో స్థానంలో నిలిచింది. పిల్లలకు రూ.1,169.62 కోట్ల కేటాయింపులతో వైద్య, ఆరోగ్య శాఖ మూడో స్థానంలో ఉంది. పేదల సొంతింటి కల సాకారం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే 25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను 30.76 లక్షల మందికి పంపిణీ చేసిన ప్రభుత్వం.. వాటిలో మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్లో రూ.5,661.57 కోట్లను కేటాయించి చిత్తశుద్ధి చాటింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున అర్హులైన 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను ఇప్పటికే పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 4.63 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే గత సర్కార్ కంటే ఇప్పుడు ఆరు రెట్లు ఎక్కువ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 17,005 లే–అవుట్లలో 28.30 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ లే–అవుట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రూ.50,940 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. 17,005 ఊళ్లను నిర్మిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా ఊళ్లను నిర్మించిన దాఖలాల్లేవని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో 2.60 లక్షల ఇళ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పేద రోగులకు భరోసా పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ చంద్రబాబు.. ఎల్లో మీడియా తరహాలో మేమూ విమర్శలు చేయగలం. కానీ సాధించేదేంటి? కోవిడ్ సమయంలో అందరూ కలిసి పని చేయాలి. వేలెత్తి చూపేకన్నా ఒకరినొకరం ప్రోత్సహించు కోవడం, ఒకరికి ఒకరం మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాం. నిలబడే ప్రాణాలను, ఆడే గుండెలను ఆపేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ ‘ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టే కోవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు నిజాయితీగా పోరాడుతున్నాం. ఎంత ఖర్చు చేసైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తెప్పిస్తాం. ప్రజలందరికీ ఉచితంగా ఇప్పిస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం ప్రకటించారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరిందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సూచన మేరకు కోవిడ్ మృతులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రాణం విలువ బాగా తెలిసిన వాడిని కాబట్టే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు గుండె పగిలిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఓదార్పు యాత్ర చేశానని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రాణం పోసేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దానన్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని, వెయ్యి జబ్బులకే పరిమితమైన ఈ పథకాన్ని 2,400 జబ్బులకు అమలయ్యేలా విస్తరించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనానాలు 1180 కొనుగోలు చేశామన్నారు. వైద్య సదుపాయాలున్న ఈ వాహనాలు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ అంటూ వచ్చేలా ప్రతి మండలానికి చేరవేశామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 2 వేల మందికి హెల్త్ వర్కర్ను నియమించామని, ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు కడుతున్నామని తెలిపారు. అక్కడ 91 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, 24 గంటలూ ఏఎన్ఎం ఉంటారని, ప్రతీ మండలానికి రెండు పీహెచ్సీలు.. ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనం అనుసంధానమయ్యేలా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయువు నిలిపేలా ఆస్పత్రులు ►ఊహించని విధంగా కోవిడ్ సవాల్ను ఎదుర్కొంటున్నాం. గతేడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో కోవిడ్ పరీక్షల కోసం శాంపుల్స్ పూనెకు పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 లేబొరేటరీలు.. రోజూ లక్ష పరీక్షలు చేస్తున్నాయి. ►తొలి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్య సేవలందిస్తే.. ఇవాళ 649కి పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరం (టైర్ వన్ సీటీ) లేకుండా పోయింది. ఆదునిక వైద్యం టైర్వన్ సిటీల్లోనే లభిస్తోంది. ఈ వాస్తవాల్ని గ్రహించే నాడు–నేడు కార్యక్రమం ద్వారా అన్ని స్థాయిల ఆస్పత్రుల రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ►కొత్తగా ప్రతి పార్లమెంట్ పరిధిలో బోధనాసుపత్రి, నర్సింగ్ కాలేజీ పెట్టబోతున్నాం. ప్రతి వ్యక్తి దగ్గరకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నాం. మొదటి వేవ్ కరోనా సమయంలో 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నాం. ఇందులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆక్సిజన్, మందులు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ ►రెండో వేవ్లో 649 ఆస్పత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం తీసుకున్న 261 ఆస్పత్రుల్లో 34,441 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్ కేర్ సెంటర్స్లోనూ మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. మరో 52,471 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. ►కోవిడ్ సెంటర్లలో 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసి, అక్కడ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి, ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనేమో. ప్రతిరోజు 25 వేల మంది ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతున్నారు. 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు ►గడిచిన 14 నెలల కాలంలోనే కోవిడ్ కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్ ఫంగస్ వస్తోందని తెలిసిన వెంటనే ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా.. దాన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ నెల 18వ తేదీన 17 ఆస్పత్రులను గుర్తించాం. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టులు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను 18,270 మందిని విధుల్లోకి దించాం. ►104 నంబర్కు ఫోన్ చేస్తే కోవిడ్ సమాచారం ఇచ్చేలా చేశాం. ఈ నంబర్కు ఈ నెల 16వ తేదీ నాటికి 3.12 లక్షల కాల్స్ వచ్చాయి. ఇందులో 60,634 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. మరో 46,421 మందికి పరీక్షలు చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ రోగులకు.. 680 మంది స్పెషలిస్టులతో కలిపి 3,991 మంది డాక్టర్లు టెలీ మెడిసిన్ వైద్యం అందిస్తున్నారు. ఆక్సిజన్ కోసం అనుక్షణం పరుగు ►రాష్ట్రానికి ఆక్సిజన్ తెప్పించే ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం కాకూడదని.. రోజుకు నాలుగైదు ట్యాంకులను ఒరిస్సాకు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. విదేశాల నుంచి ఆక్సిజన్, క్రయోజెనిక్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్స్ ద్వారాను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎన్ని వందల కిలోమీటర్లలో దొరుకుతుందన్నా.. ఎంత ఖర్చుకైనా సిద్ధపడి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం. ►రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో 53 ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు నాంది పలికాం. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లు తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న వాళ్లకు 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ అందించేలా 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుకు సిద్ధమయ్యాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయి. ►10 వేల డి టైప్ సిలెండర్ల కొనుగోలుకు రూ.309 కోట్లతో ఆర్డర్ ఇచ్చాం. గ్రామ స్థాయి ఆశ వర్కర్ల దగ్గర్నుంచి నర్సులు, డాక్టర్లు, శానిటేషన్ పనివాళ్లు, కలెక్టర్లు అందరూ కష్టపడి పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్ మరణాలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలో ఏపీ ఒకటి అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. వీరందరికీ హ్యాట్సాఫ్. అందరికీ లబ్ధి ►బీసీలను బ్యాక్బోన్ క్లాస్గా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్య తరగతి వర్గాల కోసం నిలబడ్డాం. సంక్షేమానికి రూ.93,708 కోట్లు ఖర్చు చేశాం. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపాం. ►మరో రూ.31,714 కోట్లు పరోక్ష లబ్ధి ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రూ.1.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. ►ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నేను భావిస్తాను. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఇదే చెబుతాను. మనమంతా ప్రజలకు సేవకులం అని గుర్తు పెట్టుకుని పని చేయాలి. అనుభవం లేకున్నా.. హామీలన్నీ పూర్తి ►నాది పెద్ద వయసు కాకపోవచ్చు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం లేకపోవచ్చు. కానీ, చిత్తశుద్ధితో, నిజాయితీగా పని చేస్తున్నా. కోవిడ్ కష్టాల్లోనూ 129 వాగ్దానాల్లో 107 పూర్తిగా అమలు చేశాం. మరో 14 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 8 అమలు చేయాల్సి ఉంది. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో 94.5 శాతం హామీలు పూర్తి చేశాం. పాలనలో కులం, మతం, రాజకీయం, వర్గం చూడలేదు. రాబోయే తరానికి మంచి జరగాలని చూస్తున్నాం. ►విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశాం. శిథిలావస్తలో ఉన్న స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మన ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ సిలబస్, గోరుముద్ద, ఇలా అనేక పథకాలతో విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నాం. అన్ని పథకాలలో అమ్మ ఒడి కూడా గొప్పది. ►అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ పథకం, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ చట్టం చేయడం.. ఇవన్నీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేందుకు తోడ్పడతాయి. ఇదీ అభివృద్ధి అంటే. పైసా లంచం ఇవ్వకుండా, సిఫార్సులు లేకుండా నేరుగా ఇంటి గడప వద్దకే వచ్చి, తలుపు తట్టి పథకాలను వర్తింప చేస్తుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ►గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామంలోనే వార్డు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాము. ఆ గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించాం. ఆ ఇళ్ల నుంచే వలంటీర్ను ఎంపిక చేసి, వారికి తోడుగా ఉండే వ్యవస్థను తీసుకువచ్చాం. ►62 శాతం మంది వ్యవసాయంపై బతికే రైతు బతుకు మార్చకుండా.. నాలుగు బిల్డింగ్లు కడితే అది అభివృద్ధి కాదు. అందుకే రైతుల చేయి పట్టుకుని అడుగులు వేస్తూ, విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. ►అందుకే పంచాయతీ, మున్సిపల్.. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవించారు. కుట్రలు చేసిన వాళ్లు పంచాయతీ కార్యాలయాల మీద నీలం, ఆకుపచ్చ రంగులు తుడిచి వేయగలిగారు కానీ, జనం గుండెల్లోని రంగులను మాత్రం తుడిచేయలేకపోయారు. చివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు కూడా మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలు తుడిచేశారు. వ్యాక్సిన్ వాస్తవం ఇదీ ►వ్యాక్సినేషన్పై కొంతమంది పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడ్డ వాళ్లు 26 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 52 కోట్ల డోస్ల వ్యాక్సిన్ కావాలి. 18–45 ఏళ్ల మధ్య వాళ్లు 60 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 120 కోట్ల డోస్ల వ్యాక్సిన్ కావాలి. మొత్తం 172 కోట్ల డోస్లు అవసరం. ►కానీ భారత్లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ నెలకు 7 కోట్ల డోస్లు మాత్రమే. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్ 6 కోట్ల డోసులు, భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ కోటి డోసులను తయారు చేస్తున్నాయి. అందుకే ఇప్పటివరకు 18.44 (11 శాతం లోపు) కోట్ల మందికే వ్యాక్సినేషన్ జరిగింది. ఏపీలో 45 ఏళ్లు నిండిన వాళ్లు.. ఫ్రంట్లైన్ వర్కర్స్తో కలిపితే 1.48 కోట్లు ఉన్నారు. వీరికి రెండు డోసులు వేయడానికి 3 కోట్ల డోస్లు కావాలి. 18–45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 4 కోట్ల డోస్లు కావాలి. మొత్తంగా ఏపీకి 7 కోట్ల డోస్లు కావాలి. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది 76,29,580 డోసులు..అంటే 11 %లోపు. ూ వ్యాక్సిన్ ఇవ్వడం లేదంటూ, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని రాజకీయ నిందలేçస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే. చంద్రబాబుకూ వాళ్లు బంధువులే. ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలిసి కూడా ఆరోపణలు చేయడం ఏమిటి? ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తుంటే బాధేస్తోంది. పరిష్కారం వ్యాక్సినే ►ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్స్కు వెళ్లింది. జూన్ 3న బిడ్స్ వస్తాయి. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. కోవిడ్ను అడ్డుకునే పరిష్కారం వ్యాక్సినేషనే. గ్లోబల్ టెండర్లలో కంపెనీలు ముందుకు వస్తాయని, కేంద్రం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నాం. ఇదీ మా సంక్షేమ క్యాలెండర్ ఏప్రిల్ 2021 ♦జగనన్న వసతి దీవెన మొదటి విడత ♦జగనన్న విద్యా దీవెన మొదటి విడత ♦రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ (2019 రబీ) ♦పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు మే 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చాం. ♦మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ, డీజిల్ సబ్సిడీ) ఇచ్చాం. ♦వైఎస్సార్ ఉచిత పంటల బీమా (2020 ఖరీఫ్) మే 25న ఇవ్వబోతున్నాం. జూన్ 2021 ♦జగనన్న తోడు తొలి విడత ♦వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత ♦వైఎస్సార్ చేయూత మూడో విడత చెల్లింపులు ♦జూన్ 8న జగనన్న తోడు బ్యాలెన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత. జూలై – 2021 ♦జగనన్న విద్యా దీవెన రెండో విడత ♦వైఎస్సార్ కాపు నేస్తం ♦విద్యా కానుక ఆగస్టు 2021 ♦రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020 ఖరీఫ్). ♦ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. ♦వైఎస్సార్ నేతన్న నేస్తం. ♦అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. సెప్టెంబర్ 2021 ♦వైయస్సార్ ఆసరా అక్టోబర్ 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ♦జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు) నవంబర్ 2021 ♦వైఎస్సార్ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన పేద అక్కలకు సహాయం. డిసెంబర్ 2021 ♦జగనన్న వసతి దీవెన రెండో విడత ♦జగనన్న విద్యా దీవెన మూడో విడత ♦వైయస్సార్ లా నేస్తం జనవరి 2022 ♦పెన్షన్ నగదు పెంపు. ఈ నెల నుంచి నెలకు రూ.2,500. ♦వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత ♦జగనన్న అమ్మ ఒడి ఫిబ్రవరి 2022 ♦జగనన్న విద్యా దీవెన నాలుగో విడత