రెండేళ్లు.. రెండు బిల్డింగులు

– అమరావతి భూములు సింగపూర్‌ కంపెనీకే
– వెక్కిరిస్తున్న శంకుస్థాపన శిలాఫలకం
– డిజైన్ల పేరుతో కాలక్షేపం 
– విదేశీ పర్యటనలతో ప్రజాధనం వృథా

అమరావతిని స్వర్గసీమ చేస్తానని కదలకుండా నిల్చున్నచోటే నమ్మబలికాడు. సింగపూర్, మలేసియా, దావోస్, దుబాయ్‌ల తరహాల అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దుతానని గుక్కతిప్పుకోకుండా గొప్పలు చెప్పుకున్నాడు. నవ్యాంధ్ర నిర్మాణానికి మొదటి కూలీ అవుతానన్నాడు.  చివరి రక్తపు బొట్టు వరకు ఒక శ్రామికుడిలా పనిచేస్తానన్నాడు. అద్భుత రాజధాని కల సాకారం కావాలంటే మీరూ సహకరించాలని పట్టువదలని విక్రమార్కుడిలా పోజులు కొట్టాడు. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఒక్కరోజు తతంగానికి రూ. 400 కోట్లు ఖర్చు చేసి  బురదలో గుమ్మిరించాడు. పేదరాష్ట్రం.. విభజనతో నష్టం జరిగింది.. మోసపోయాం.. కష్టాల్లో ఉన్నాం... చెట్టకింద పాలన చేయడానికి కూడా వెనుకాడనని అనర్గళంగా ఉపన్యాసం చదివాడు. జనం నమ్మేశారు. గెలిపించినందుకు రుణం తీర్చుకుంటానన్నాడు... అంతకన్నా కావాల్సిందేముందని సంబరపడ్డారు.. ఇన్ని చెప్పిన పెద్దమనిషి ఆ సంగతి పట్టించుకోవడం మానేశాడు. ఓటుకు నోటుకు కేసులో పట్టుబడి  ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ ను వదిలి అమరావతికి పరుగులు పెట్టాడు. అంతులేని అవినీతికి తెరలేపాడు. 

అమరావతి పేరుతో ఆడంబరాలు
కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఉన్నట్టుండి అమరావతి గుర్తుకొచ్చింది. భూమి పూజ పేరుతో ప్రత్యేక హెలిక్యాఫ్టర్లు తెప్పించి ఆడంబరం ప్రదర్శించాడు. కష్టాల్లో ఉన్నామంటూనే ఒక్కరోజుకు రూ. 400 కోట్లు గుమ్మరించేశాడు. ప్రధాని మోడీని ఆహ్వానించాడు. ఆయనొచ్చి పుట్ట మట్టి.. గంగా జలం ఇచ్చి వెళ్లిపోయాడు. అమరావతి నిర్మాణానికి అక్టోబర్‌ 23, 2015 భూమి పూజ చేశారు. అది జరిగి ఇప్పటికి  రెండేళ్లయింది. ఈ మధ్య కాలంలో అమరావతి పేరుతో రైతుల నుంచి దాదాపు 33వేల ఎకరాలు లాక్కున్నారు. దేశం మొత్తం వద్దని వారించిన స్విస్‌ చాలెంజ్‌ విధానానికి మొగ్గుచూపుతూ రైతుల భూములను వారి చేతుల్లో పెట్టేశాడు. రాజధానికి అమరావతి అనువుగా ఉండదన్నా ఒప్పుకోలేదు. రాజధానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని మేధావులు చెబుతున్నా చెవికెక్కించుకోలేదు. ఏం జరుగుతుందో తెలీదు.. భూములివ్వని రైతుల పంటలు రాత్రికిరాత్రే తగలబడి పోయేవి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో టీడీపీ నాయకులు, మంత్రులు వేలాది ఎకరాలు రైతుల భూములను కొనేశారని మీడియా గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ తప్పుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేశారు. 

రూ. 900 కోట్లతో చిల్లులు పెట్టాడు
మూడేళ్లలో చంద్రబాబు అమరావతి పేరుతో చేపట్టింది రెండు తాత్కాలిక భవనాలు తప్ప ఇంకేం లేదు. రూ. 900 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన అసెంబ్లీ నిర్మించారు. చిన్నపాటి వర్షానికి ప్రతిపక్ష నాయకుడి ఛాంబర్లో నీళ్లుగారి అభాసుపాలయ్యాడు. దేశీ ఇంజినీర్ల పనితనాన్ని ఎగతాళి చేసి విదేశీ పరిజ్ఞానమంటూ వెంపర్లాడిన బాబుకు ఆ ఘటన బాగానే బుద్ధి చెప్పింది. సచివాలయం నిర్మిస్తే బాత్‌రూమ్‌లు లేక మహిళలు ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాది పాటు తమకు కేటాయించిన ఛాంబర్లో మంత్రులు కూర్చుంటున్న పాపానపోలేదు. ఉద్యోగులను హడావుడిగా తరలించారు తప్ప వారికి వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చెట్టుకింద పాలన చేస్తానని నీతులు చెప్పిన ముఖ్యమంత్రి ....రక్షణ చర్యల పేరుతో తన కార్యాలయానికి పెట్టిన ఖర్చులకు దేశం నివ్వెరపోయింది. రకూ. 5 కోట్లు ఖర్చు చేసి బస్సు కొనుగోలు చేశాడు. అగ్రిగోల్డు బాధితుల భూములు లాక్కున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగనేని గెస్ట్‌ హౌస్‌కు మకాం మార్చాడు. నిబంధనలకు విరుద్దంగా కట్టిన అక్రమ భవనంలోనే సీఎం నివాసం ఉంటున్నాడు. అంతకముందు ఏడాదికిపైగా స్టార్‌ హోటల్‌లో ఉండి రోజుకు రెండు లక్షలకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. పేదరికం గురించి చెప్పిన ఈ పెద్దాయన.. తన ఆడంరాలకు ఏమాత్రం లోటు రానీయలేదు. 

గ్రాఫిక్సు బొమ్మలతో కాలక్షేపం
పెట్టుబడుల పేరుతో ఇప్పటికే చంద్రబాబు 17సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. (ప్రస్తుతం అక్టోబర్‌ 18 నుంచి 26 జరుగుతున్న మూడుదేశాల పర్యటనలు కలిపి) ఆయా దేశాలు వెళ్లి వచ్చిన ప్రతిసారీ ఏదో చేస్తున్నట్లు అనుకూల మీడియాలో వార్తలు రావడం తప్పించి ఒక్క కంపెనీ నెలకొల్పిందీ లేదు.. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిందీ లేదు. చివరికి ఆయన విదేశీ పర్యటనలు ప్రజలకు భారంగా మారాయి. పైగా ఇవేవీ చాలవన్నట్టు 6 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దావోస్‌ పర్యటనకు టిక్కెట్టు కొనుక్కుని మరీ వెళ్లి వచ్చాడు. ఏం సాధించడయ్యా అంటే.. ఆ ప్రశ్న అడగొద్దు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర కార్యకలాపాలకు తన సొంత అవసరాలకు వాడుకుని లెక్కలడిగితే చేష్టలుడికి చూస్తుండిపోయారు. అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేక డిజైన్ల పేరుతో కాలక్షేపం చేయాలని మరో కొత్తనాటకానికి తెరతీశారు. ప్రపంచ ఏజెంటుగా ముద్రపడిన చంద్రబాబు అమరావతి రైతుల భూములు తాకట్టుపెట్టి అప్పు తీసుకొద్దామని చూసి ఘోరంగా దెబ్బతిన్నాడు. పెయిడ్‌ రైతులను మోహరించి అమరావతి ప్రజలు ఎదురు తిరగడంతో పలాయనం చిత్తగించాడు. డిజైన్లు నచ్చలేదని రెండేళ్లుగా కాలక్షేపం చేస్తూనే ఉన్నాడు. 
Back to Top