నిజాయితీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం

కుప్పం‌ :

నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఇలాకా కుప్పంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన శ్రీ జగన్ కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనంగా స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.‌ కుప్పంలోకి దారితీసే రహదారులన్నీ జనసంద్రంగా మారిపోయాయి.

చిత్తూరు జిల్లా ప్రత్యేకతలు తెలియజేస్తూ శ్రీ జగన్ తన ప్రసంగ‌ం కొనసాగించారు. రాయలు ఏలిన రతనాలసీమ - వెంకటేశ్వరుడు కొలువైన, కాణిపాకం వినాయకుడు ఉన్న నేల చిత్తూరు జిల్లా అన్నారు. చందమామలో  మచ్చలు ఉన్నట్లుగా మన చిత్తూరు జిల్లాకు రెండు మచ్చలు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమా‌ర్ రెడ్డి అ‌ని విమర్శించారు. వీళ్ళు చిత్తూరు జిల్లా వాసులు కావడం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతో పాటు అందరూ సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే వీరిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. నిజాయితో కూడిన రాజకీయాలకు వారు దూరంగా ఉన్నారన్నారు. సమైక్య శంఖారావం పిలుపుతో నాయకులలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అని సవాల్‌ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని పిలుపు ఇచ్చారు.

నేను గట్టిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ‘రాష్ట్రాన్ని విడగొడతామని అంటున్నారు’ మీరు ఒప్పుకుంటారా? ’ (ఒప్పుకోం.. ఒప్పుకోం అని జనం స్పందన). మీరు తెలుగులో చెప్తున్నారు. తెలుగులో చెప్తే ఢిల్లీ వారికి, సోనియాకు అర్థం కాదు. కిరణ్, చంద్రబాబుకు కూడా అర్థం కాదు. ‘నో’ అని చెప్పండి. (నో.. నో అంటూ జనఘోష) సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్.. ఈ ముగ్గురిని క్షమిస్తారా? (ప్రజల నుంచి ‘నో.. నో’ అని సమాధానం). ఇప్పటికైనా వారికి బుద్ధి వస్తుందేమో అని ఆశిస్తున్నాఅని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

జై సమైక్యాంధ్ర, జై వైయస్ఆర్, జై తెలుగుతల్లి అ‌నే నినాదాలతో శ్రీ వైయస్‌ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

జగన్ సమక్షంలో ‌పార్టీలో చేరిన టీడీపీ నాయకులు :
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది. ఈ సందర్భంగా శ్రీ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. వీరిలో రామకుప్పం మాజీ ఎంపీపీ, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడితో సహా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పంలో‌ పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శ్రీ జగన్‌ సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులతో కుప్పం రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్లు నిండిపోవడంతో జనం శ్రీ జగన్‌ను చూడాలని మేడలపైన, మిద్దెలపైన ఎక్కి జనం ఎదురు చూశారు. కుప్పంలో ఎటు చూసినా జనమే జనంగా మారింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి‌పోయింది.

తాజా వీడియోలు

Back to Top