కుప్పం నుంచి నేడు సమైక్య శంఖారావం

తిరుపతి :

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ‌చంద్రబాబు ఇలాకాలో శనివారం అతి పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. దీనికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వై‌యస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించలేదు. తొలిసారిగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌భారీ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా కుప్పం సరిహద్దు కాళికమ్మ ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనితో తెలుగుదేశం నాయకులలో గుబులు నెలకొంది. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం కుప్పంలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగనుంది. తొలి రోజున నాలుగు చోట్ల దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గం వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఏర్పాట్లు చేశారు.

‌కుప్పంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కన్వీనర్ నారాయణస్వామి కుప్పం చేరుకున్నారు.‌ శ్రీ జగన్ పర్యటన పర్యవేక్షణను ‌పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చే‌స్తున్నారు. సమైక్య శంఖారావం సభకు కుప్పం పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కుప్పం నియోజకవర్గం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణులతో నిండిపోయింది.‌ శ్రీ జగన్ పైపాళెంలో ఓదార్పు ముగించుకుని వచ్చిన తరువాత సమైక్య శంఖారావం సభను బ‌స్‌స్టాండ్ వద్ద నిర్వహిస్తారు.

దీని‌ కోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సమైక్య శంఖారావానికి జిల్లాలోని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ముఖ్యులతో పాటు, కార్యకర్తలు, పార్టీల‌కు అతీతంగా ప్రజలు హాజరు కానున్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య సభపై కుప్పం వాసులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ సమైక్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సమైక్యత కోసం కట్టుబడిన నాయకుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అంటున్నారు.

చంద్రబాబు నాయుడు కుప్పంలో నీళ్లు రాకపోయినా పట్టించుకోవడం లేదని, విభజన జరిగితే అసలు నీళ్ల్లే దొరకవని ఆందోళనగా ఉందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Back to Top