వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం
10 Jan 2014 1:43 PM
హైదరాబాద్ :
అసెంబ్లీ సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దమనకాండకు తెగబడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశాక వారిపై పోలీసుల అణచివేత చర్యలు అసెంబ్లీ ఇన్నర్ లాబీల నుంచే తెర లేచింది. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్సు బలవంతంగా లాబీల్లోకి తరలించారు. వారంతా మళ్లీ ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్సుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తలుపులు మూసివేశారు. అందుకు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పెనుగులాటకు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీసం నిరసన తెలిపేందుకు కూడా ఎమ్మెల్యేలకు పోలీసులు ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు.
సభ నుంచి మాత్రమే తమను సస్పెండ్ చేశారని, లాబీల్లో, ఇన్నర్ లాబీల్లో తాము ఉండవచ్చని పార్టీ సభ్యులు చెప్పినా వారు వినిపించుకోలేదు. ‘హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరిమేస్తారా?’ అంటూ తలుపులను బలవంతంగా తెరిచి ఇన్నర్ లాబీల్లోకి దూసుకెళ్లారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభలోకి వెళ్తారనే అనుమానంతో టాస్కుఫోర్సు అదనపు డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మార్షల్సు విధులు నిర్వరిస్తున్న పోలీసులు ఇన్నర్ లాబీలోని మెట్ల వద్ద అడ్డుకున్నారు. మరోసారి చేతులపై ఎత్తుకుని బయటికి తరలించారు. మార్షల్సు చర్యను నిరసిస్తూ ఎమ్మెల్యేలంతా 10 నిమిషాల పాటు లాబీల్లో బైఠాయించారు. సభ నుంచి వాకౌట్ చేసి వచ్చిన పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు శ్రీమతి విజయమ్మ వారితో కలిశారు.
లాబీల నుంచి తరలించేందుకు మార్షల్సు ప్రయత్నించడంతో నిరసనగా విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట రవీంద్రభారతి చౌరస్తా దిశగా బయల్దేరారు. సస్పెండైన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మద్దతుగా ఉన్న మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వీరిలో ఉన్నారు. వారిని ఖాకీలు అడుగడుగునా అడ్డుకున్నారు.
సభా ప్రాంగణం నుంచి బయటికొచ్చి సమైక్యాంధ్రప్రదేశ్ ప్లకార్డులు పట్టుకుని బయటకు వెళుతున్న వారిని కూడా మార్షల్సు విడిచిపెట్టలేదు. ఎమ్మెల్యేలు రోడ్డు మీదకు వస్తుండగానే, పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం ఒక్కసారిగా అందరినీ చుట్టుముట్టారు. అసెంబ్లీ రెండవ గేట్ నుంచి బయటికి వస్తున్నఎమ్మెల్యేలను చిత్రించేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకరులను ఎక్కడికక్కడ లాగిపారేశారు. ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటుచేసి మరీ ఎమ్మెల్యేల దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగానే వారిపై బలప్రయోగం చేశారు.
పోలీసుల చర్యకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన కొరుముట్ల, గడికోటలను వారు లాగిపడేశారు. శ్రీమతి విజయమ్మతో పాటు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కె. శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథ్రెడ్డి, వై.చెన్నకేశవరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విశ్వరూప్, శ్రీకాంత్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఈ చర్యకు నిరసనగా పార్టీ ఎమ్మెల్యేలంతా స్టేడియంలోనే ధర్నా చేశారు. అసెంబ్లీ వాయిదా పడే వరకూ సభ్యులను నిర్బంధంలోనే ఉంచి, మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున గోషామహల్కు తరలివచ్చి ఎమ్మెల్యేలకు సంఘీభావం ప్రకటించారు.