మాయని చరిత్ర

గత చరిత్రలు గొయ్యి తీసి పాతిపెట్టడం, చరిత్రలను చరిత్రలో లేనట్టు మార్చి చెప్పడం ఇవీ చంద్రబాబు ఇటీవలి పోకడలు. రాజకీయ సంగ్రామంలో తల పండిపోయి, వార్థక్యం వచ్చి, అల్జీమర్స్ లాంటి వ్యాధి ఏమైనా వచ్చిందా అని ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి చంద్రబాబు చేష్టలు. వివిధ సభల్లో చంద్ర బాబు ప్రసంగాలు ఇలాంటి అనుమానాలకే దారి తీస్తున్నాయి. ఆ సంగతి వదిలేస్తే, ఏడాది కూడా లేని ఎన్నికల కాలంలో చంద్రబాబు వేస్తున్న పాచికలు అటు ఇటుగా పడుతున్నాయి. గతంలో బాబు తాను ప్రవర్తించిన దారుణమైన తీరును కూడా మర్చిపోయి, అపర దాన కర్ణుడు, ఆధునిక శిబి చక్రవర్తి అన్న రేంజ్ లో వరాలు గుప్పిస్తున్నట్టు ఫోజు కొడుతున్నారు. అయితే వాస్తవం వేరు.
కేసులు పెట్టిన చేత్తోనే
కొన్నేళ్ల కాలంగా అంగన్ వాడీలు, హోమ్ గార్డులు, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, 108 సిబ్బంది మొదలైన వారంతా తమ వేతనాలు, హక్కుల గురించి ముఖ్యంత్రికి ఎన్నో వినతులు, విజ్ఞప్తులు చేసుకున్నారు. చాలీచాలని జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్నామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందిచకపోయే సరికి పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను సీరియస్ గా తీసుకువెళ్లే ప్రయత్నాలు చేసారు. కానీ చంద్రబాబు వారి ప్రయత్నాలన్నిటినీ నిర్థాక్షిణ్యంగా అణిచి వేసాడు. పోలీసులతో లాఠీ ఛార్జులు చేయించాడు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై కేసులు పెట్టించాడు. జైల్లోకి తోయించాడు. ఆ గత చరితనంతా మరిచిపోయినట్టే ప్రవర్తిస్తూ, నేడు అదే విభాగాలవారిని పిలిచి వారికి వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించి, ఇంకెన్నో వరాలు గుప్పిస్తున్నాడు. దీనికి బదులుగా ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రచారం చేయమని స్వయంగా ముఖ్యమంత్రే డీల్ మాట్లాడుతున్నాడు. టిడిపి ప్రభుత్వంపై సానుకూలత పెరిగేలా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ వారిపై ఎన్నికల బాధ్యతలను పెట్టాడు కేసులు పెట్టినచ చేత్తోనే సాయం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు. నిజానికి ముఖ్యమంత్రి ఈ పనులు ఎప్పుడో చేయవలిసింది. కేవలం ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలు చేకూరడం కోసమే ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడు. ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చి ఇన్నాళ్లూ మర్చిపోయిన చంద్రబాబు నేడు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సంక్షేమంలో భాగంగా కాదు, పార్టీ ఎన్నికల ప్రచారంగా. ఇంత చేసినా చంద్రబాబు ఈ శాఖల్లో ఉద్యోగులకు ఇస్తున్నది పొరుగున ఉన్న తెలంగాణా కంటే తక్కువే. 
అత్తెసరు సాయానికే సన్మానాలు
ప్రభుత్వాధినేత అయి ఉండి వివిధ వర్గాల ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుది. కానీ బాబు మాత్రం వివిధ వర్గాలకు చేస్తున్న వేతనాలు, అలెవెన్సుల పెంపును ఓ దాతృత్వ ప్రక్రియలా చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. పైగా ఆ శాఖల ఉద్యోగులతో కృతజ్ఞతల సభలంటే ఏర్పాటు చేయిస్తున్నాడు. చిత్రమేమంటే ముఖ్యమంత్రికి సన్మానం చేయడానికయ్యే ఖర్చంతా ప్రభుత్వ ఖజానా నుంచే వెళుతోంది. నిజంగా బాబు నిర్ణయాలతో సంతోషించి ఉంటే ఉద్యోగులే స్వయంగా చందాలేసుకుని బాబుగారి సన్మాన సభ పెడతారు. కానీ ఇక్కడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చంద్రబాబుకు ఇలాంటి సన్మానాలు జరుగుతున్నాయి. ఉద్యోగులను తరలించడం, వారి భోజన ఖర్చులు, కార్యక్రమానికయ్యే ఖర్చులను ప్రభుత్వ పద్దుల్లోంచే చెల్లిస్తున్నారు. అంటే ఇవి అద్దె సన్మానాలన్నమాట. అరువు పొగడ్తలన్నమాట. ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిరమరీ చంద్రబాబు తన భజన కార్యక్మ్రం చేయించుకుంటున్నాడు. 
విమర్శించిన ప్రతిపక్ష నేత
చంద్రబాబు తీరును ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ముందే ఎండగడుతున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, ఆ హామిని అడిగిన వారిపై కేసులు బనాయించిన చంద్రబాబు నేడు సన్మానాలు ఎలా చేయించుకుంటున్నారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్. రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యోగులను వాడుకోవడం బాబు రాజనీతి అని అంటున్నారు. పేరుకే ఘనకార్యం చేసినట్టు బాబు ప్రచారం చేయించుకుంటున్నా, ఉద్యోగులకు బాబు ఇస్తున్నది తెలంగాణాతో పోల్చితే అతి తక్కువ అని దుయ్యబట్టారు. ఇన్నేళ్లుగా ఉద్యోగులను కష్టాలపాలు చేసి నేడు ఆదుకుంటున్నట్టు నాటకం ఆడితే చరిత్ర మాసిపోతుందా అని ముఖ్యమంత్రిని సవాల్ చేసారు. 






 
Back to Top