<br/>పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారు. నాలుగేళ్లు హాయిగా అధికారాన్ని అనుభవించారు. మీరు చెప్పిన మాట కోసం ఐదు కోట్ల ఆంధ్రులు ఆశతో ఎదురు చూశారు. ఇంకొద్దరు హోదా కోసం ఆత్మ త్యాగాలు చేశారు. నాలుగేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేసింది. ధర్నాలు, నిరాహార దీక్షలు, బంద్లు, యువభేరి సభలు నిర్వహించారు. పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా లెక్క చేయకుండా పోరాడుతూనే ఉన్నారు. చివరకు వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టినా కేంద్రం పట్టించుకోలేదు. హోదా కోసం గతంలో చిత్తూరు జిల్లాకు చెందిన ముని కోటి అనే యువకుడు ఒంటికి నిప్పంటించుకొని బలి అయ్యాడు. అయినా కనికరించలేదు. నిన్నటికి నిన్న హోదా కోరుతూ తలపెట్టిన బంద్లో పశ్చి్మ గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు అనే వైయస్ఆర్సీపీ కార్యకర్త గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఇవాళ ఏకంగా సీఎం సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లికి చెందిన సుధాకర్ అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత మంది ఆత్మార్పణం చేసుకున్నా కేంద్రం కళ్లు తెరవలేదు. ఏపీ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఏపీకి తెలంగాణ ఇవ్వాలని బలంగా కోరుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ ఢిల్లీ ప్రభుత్వానికి తెలిసేలా తెలంగాణ బిడ్డ ఉమేష్రెడ్డి సెల్ టవర్ ఎక్కి ఢిల్లీ పోలీసులను కదిలించారు. జాతీయ మీడియా కదిలొచ్చింది. యువకుడు టవర్ ఎక్కి నిరసన తెలపుతుండటంతో ఏ క్షణం, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ఆ పరిసర ప్రాంతాల్లోని జనం భారీ సంఖ్యలో టవర్ చుట్టూ గుమిగూడారు. దీంతో టవర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సైతం స్తంభించింది. యువకుడు ఆందోళన చేపట్టిన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది అని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అతడిని కిందికి దిగిరమ్మని విజ్ఞప్తిచేశారు. అయితే, యువకుడు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టవర్ పైనే ఉండిపోయాడు. మీడియా సహకారంతో పోలీసులు యువకుడితో మాట్లాడి కిందకు దించారు. సమైక్య ఆంధ్ర విభజన ప్రక్రియపై తనదైన భాషతో ప్రధాని మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని కదిలించే స్టేట్మెంట్ ఇచ్చారు. తల్లి లేని బిడ్డ పాలివ్వమంటే మటుకు మొరాయించే రాతి గుండెలా వ్యవహరిస్తూనే ఉన్నారు.