– జననేతకు అభ్యర్థుల నుంచి వెల్లువెత్తుతున్న అభిమానం
-పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థుల్లో సంతోషం
– వైయస్ఆర్సీపీ కృషి వల్లేనని కితాబు
– పార్టీకి యువత నుంచి అనూహ్య స్పందన
వైయస్ఆర్సీపీ పోరాటానికి ప్రభుత్వం మెడలు వంచింది. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయించడంలో వైయస్ఆర్సీపీ విజయం సాధించింది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు సమయం చాలా తక్కువగా ఉందని.. వాయిదా వేయాలని అభ్యర్థుల పక్షాన పార్టీ యువజన, విద్యార్థి విభాగం చేసిన పోరాటాలకు ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఈనెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షను జూలై 15, 16కు వాయిదా వేసింది. తాజా నిర్ణయంతో అభ్యర్థులకు మరో రెండు నెలల ఎక్కువ సమయం దక్కినట్టయింది.
భారీ సిలబస్... 45 రోజులే గడువు
గ్రూప్–2 ప్రిలిమ్స్, మెయిన్స్కి మధ్య కేవలం 45 రోజులే గడువు వచ్చింది. మార్కెట్లో పుస్తకాలు అందుబాటులో లేకపోవడం...పరీక్షకు ప్రభుత్వం తక్కువ సమయం కేటాయించడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారు. రాకరాక వచ్చిన నోటిఫికేషన్ కావడంతో ప్రతిఒక్కరూ ఉద్యోగం సాధించాలనే కసితే చెమటోడ్చి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించారు. అయితే మెయిన్స్ విషయానికొచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం అభ్యర్థుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. భారీ సిలబస్తో బండెడు పుస్తకాలను ముద్రించింది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన నాటి నుంచి కేవలం 45 రోజులకే మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో అభ్యర్థులకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అభ్యర్థులకు అండగా నిలుస్తూ వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు ఆందోళనకు దిగడంతో సర్కార్ దిగివచ్చింది. పరీక్షను వాయిదా వేసింది. అంతకుముందు పలుమార్లు పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు ఏపీపీఎస్సీ చైర్మన్ను, టీడీపీ మంత్రులను, లోకేష్ను కలిసి విన్నవించుకున్నారు. ఐనా లాభం లేకపోయింది.
వైయస్ జగన్ లేఖతో కదిలిన యంత్రాంగం
గ్రూప్–2 అభ్యర్థుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. భారీ సిలబస్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ నాయకులు కూడా గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున యువజన, విద్యార్థి విభాగాల నాయకులు ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. యాప్ను క్రియేట్ చేసి ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యర్థులు భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఈనెలలో పరీక్షను నిర్వహించడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చేసేదేం లేక ప్రభుత్వం దిగివచ్చింది. వైయస్ఆర్సీపీ పోరాటంతోనే పరీక్ష వాయిదా పడిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ కల్పించుకోవడం వల్లే తమకు న్యాయం జరిగిందని గ్రూప్–2 అభ్యర్థులు ఆనందంతో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.