విజయనగరం: చంద్రబాబువన్నీ కూడా 420 (ఫోర్ ట్వంటీ) బుద్ధులే అని, ఆయన పుట్టిన తేదీ మహాత్యమో లేక ఆయన నైజం మోసం చేయడమో అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 650 వాగ్ధానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని మోసం చేసేందుకు హామీలు ఇస్తున్నారని, చంద్రబాబు చెప్పేవన్నీ కూడా మాయో అని, ఆయన మాటలు నమ్మొద్దని సూచించారు. మరో 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని అందరికి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్.కోటలో నిర్వíßంచిన బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే.. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగానంటే ఆ దేవుడి దయ..మీ అందరి చల్లని దీవెనలే. ఆ పాదయాత్ర ఈ నియోజకవర్గం గుండా కూడా సాగింది, ఆ రోజు మీ పడిన కష్టాలు, మీ బాధలు నేను ఇవాళ్టికి మరిచిపోలేదు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఇదే నియోజకవర్గంలో టీడీపీ పుట్టిన తరువాత 2004 తప్ప మిగత అన్నిసార్లు టీడీపీని గెలిపిస్తున్నారు. ఇంతగా తెలుగు దేశం పార్టీని ఆశీర్వదించినా ప్రజలు గుర్తించుకునే మూడు పనులైనా చేశారా? ఇదే నియోజకవర్గంలోని ఎల్.కోట, కొత్త వలస మండలాల్లో నిరంతరం కరువు ఉంటుంది. రైవాడ రిజర్వాయర్ ఉన్నా కూడా ఇక్కడ తాగునీటికి కటకటే. సాగునీటి పరిస్థితి అంతే. ఇక్కడి నుంచి విశాఖకు నీరు తరలిస్తున్నారు. ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడి నుంచి నీరు తరలివెళ్తుంటే రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు ఇన్నాళ్లు గాడిదలు కాస్తున్నారా? అని అందరి తరపున అడుగుతున్నాను. ఇదే నియోజకవర్గంలోనే బాబు గారు వస్తే కర్మగారాలు ఏవిధంగామూతపడుతున్నాయో ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో మనకు ఉపయోగపడే చక్కెర సహకార రంగంలోని ఫ్యాక్టరీ భీంసింగి పరిశ్రమ గురించి ఆలోచన చేయండి. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని ఎలా మూత వేయించారో..2004లో వైయస్ఆర్ హయాంలో మళ్లీ ఈ భీంసింగ్ ఫ్యాక్టరీని తెరిపించారు. మళ్లీ చంద్రబాబు పాలనలో రూ.43 కోట్ల అప్పుల్లోకి నెట్టారు. ఒక్కసారి ఆలోచన చేయండి. చెరకు రైతులకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? ఉత్తరప్రదేశ్లో మద్దతు ధర ఉంటే..మనకు మాత్రం ఆ ధర లభించడం లేదు. విశాఖ నగరానికి అతి సమీపంలో ఉన్నా కూడా ఐదేళ్లుగా కనీసం ఒక్క కొత్త పరిశ్రమ అయినా వచ్చిందా? ఇదే జిల్లాలో జ్యూట్ మిల్లులు మూత పడుతున్నాయి. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా గిరిజన యూనివర్సిటీ పనులు ఐదేళ్లుగా కనీసం ప్రారంభం కూడా కాలేదు. చంద్రబాబు పాలనలో మన నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందా? 2014 ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని ఏప్రిల్లో హామీలు ఇచ్చారు. 2019 ఏప్రిల్ వచ్చింది..మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ వందల వాగ్ధానాలు చేసేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబు పుట్టింది ఇదే ఏప్రిల్ మాసంలో 20వ తేదీ పుట్టారు. ఏప్రిల్ అంటే 4వ నెల, 20వ తేదీ కదా? అంటే ఫోర్ ట్వంటీ కాదా అని అడుగుతున్నాను. అలాంటి బుద్ధులు కనిపించడం లేదా? ఏప్రిల్ 1వ తారీఖ్ను ఆల్ ఫుల్స్ డే అంటారు. చంద్రబాబు పుట్టిన రోజు మహాత్యమో. ఆయన నైజమో కానీ మొత్తానికి ప్రజలను ఫుల్స్ చేయడానికి అలవాటు పడ్డారు. చంద్రబాబు చెప్పినవి ఏదీ కూడా చేయడు. ఆకాశానికి ప్రజలను లేవనెత్తుతానని వాగ్ధానాలు చేస్తారు. ఆ తరువాత పాతాళంలోకి నెట్టేస్తారు. వ్యవసాయ రుణాలు పూర్తిగా, బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. ఏమైంది. ఐదేళ్ల పాలనలో రుణాలు మాఫీ చేయలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఏమైంది. పొదుపు రుణాలు ఇవాళ రూ.28 వేల కోట్లకు ఎగబాకిన సంగతి వాస్తవం కాదా; నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం. నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవి రెండు కూడా పూర్తిగా ఎగ్గొట్టారు. ప్రతి కుటుంబానికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. ఎన్నికల్లో వాగ్ధానం చేస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులోని హామీలన్నీ ఏమయ్యాయి. ఇవన్నీ బాబు చేసేస్తున్నారని ఇవే టీవీ చానల్స్ ఆకాశానికి ఎత్తేశాయి. ఆ హామీలు ఏమయ్యాయి. చంద్రబాబు తన మేనిఫెస్టోను మాయం చేశారు. ఆ రోజు ప్రకటనలు ఏమయ్యాయో . ఇవాళ అవేవి కనబడటం లేదు. బాబు మాటలన్నీ కూడా పూర్తిగా మాయో కదా?అని అడుగుతున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు సంతకాలు చేశారు. ఈ సంతకాలకు విలువుందా? ముఖ్యమంత్రి అయిన తరువాత ఆగస్టు 15,2014లో ప్రతి జిల్లాకు చంద్రబాబు హామీలు ఇచ్చారు. అవే విషయాలను అసెంబ్లీ సాక్షిగా వాగ్ధానం చేశారు. ఐదేళ్ల తరువాత అడుగుతున్నాను. ఆ హామీలన్నీ ఏమయ్యాయి బాబూ? చంద్రబాబు చేస్తానన్న అభివృద్ధి ఏమైంది. ఆయన చేసింది అవినీతి కాదా? దేశ చరిత్రలో ఇంతటి అవినీతి యుగం ఎప్పుడు చూసి ఉండము. సొంత కూతురును ఇచ్చిన ఎన్టీ రామారావును వెన్నుపొడిచిన చంద్రబాబు..ఈ ఐదేళ్ల పాటు ప్రజలను వెన్నుపోటు పొడుస్తునే ఉన్నారు. ఇలాంటి బాబును నమ్మొచ్చా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని ఫలానిది చేస్తానని చెప్పి..ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. ప్రతి గ్రామానికీ మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి ఓటర్ చేతిలో రూ.3 వేలు పెట్టి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. 11 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశాడని రైతన్నలకు చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాడని చెప్పండి. 11 రోజులు ఓపిక పడితే మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, పెన్షన్ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని నిరుద్యోగ యువతకు, చదువుకుంటున్న పిల్లలకు చెప్పండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్న భర్తీ చేస్తాడని తెలియజేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ చేర్చండి. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీను, ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మంచి చేస్తారన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. వీరిపై మీ అందరి ఆశీస్సులు ఉంచాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.