హైదరాబాద్: రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేశాడన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ధనంతో అధర్మ పోరాటాలు చేస్తూ ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ న్యాయవాది ఆత్మహత్యకు యత్నించాడని, దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డితోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇతర ప్రముఖులు చేసిన వాగ్దానాలు మేరకు హోదా రాలేదన్నారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో ధర్మరం, చిత్తశుద్ధి ఎన్నిపాల్లు ఉన్నాయో, ఎంత కుట్ర దాగి ఉందో ప్రజలందరికీ తెలుసని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేయాలనే ఆలోచన రావడానికి చంద్రబాబుకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పట్టిందన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని డ్రామాలు ఆడుతున్నారన్నారు. 11న ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు జనాన్ని తరలించేందుకు చంద్రబాబు అధికారులకు టార్గెట్లు విధించారన్నారు. ఎలాగైనా హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీగా ప్రజలను నమ్మించాలనే కుట్రలో భాగంగానే దీక్ష కొనసాగుతుందన్నారు. ఇందుకోసం పెద్ద ఆర్భాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కావాలని పోరాడిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ అన్నారు. ప్యాకేజీ చాలు హోదా అవసరం లేదని చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకొని ఇటీవల లేటెస్టుగా హోదా అంటూ చంద్రబాబు ఉద్యమం మొదలుపెట్టాడన్నారు. హోదా మీటింగ్లకు వెళ్లే వారిపై పీడీయాక్టులు కూడా పెడతామని చంద్రబాబు హెచ్చరించారని, పలువురిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియదన్నట్లు ఢిల్లీలో మీటింగ్ అంటే ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అసెంబ్లీలో నిన్న కాపులకు ఈబీసీ రిజర్వేషన్లో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా బిల్లు పెట్టారన్నారు. కాపులకు రిజర్వేషన్లు అని తెలిసి తప్పుదోవపట్టిస్తున్నారా..? లేక కాపులు అమాయకులు అని అనుకుంటున్నారా అని నిలదీశారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటే నమ్మి ఓట్లేశారని, మళ్లీ ఇప్పుడు 5 శాతం అంటే ఓట్లు వేస్తానని చంద్రబాబు మరో కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. రిజర్వేషన్లపై మంజునాథ్ కమిటీ వేయడానికి చంద్రబాబు సంవత్సరన్నర పట్టిందని ఉమ్మారెడ్డి అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని చెప్పలేదని, బీసీల్లో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉందో సర్వే చేయమన్నారని కమిటీ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న 5 శాతం రిజర్వేషన్లు అన్నారు.. అంతకు ముందు అసెంబ్లీలో తీర్మానం చేసిన కాపీని కేంద్రానికి పంపించామని చెప్పారు.. అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం కాపులు బీసీల్లో ఉన్నట్లా..? ఓసీల్లో ఉన్నట్లా అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల ముందు చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కు చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారని ఉమ్మారెడ్డి అన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీల మధ్య చిచ్చుపెట్టారన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కాపులను బీసీల్లో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని పార్లమెంట్లో ప్రశ్న వేశారని, దాని స్టేటస్ ఏంటీ బీసీల్లో ఎప్పుడు చేర్చుతున్నారని అడిగితే.. అటువంటి ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి రాలేదని సంబంధిత వ్యక్తులు స్పష్టంగా సమాధానం చెప్పారన్నారు. తీర్మానం కేంద్రానికి పంపలేదంటే ఎన్ని విధాలుగా మోసం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం కాపులను రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తారని నిలదీశారు.