విజయవాడ: ఏమీ చేతకాని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఆయనకు పాలించే అర్హత లేదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు. ఆయన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంగళవారం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్ని అడ్డదారులు, ఎన్ని కుట్రలు ..చంద్రబాబు ఇంకా మారడా అని ప్రశ్నించారు.. ప్రజలకు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదని ధ్వజమెత్తారు. పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. రాజధానిలో పర్మినెంట్ ఇటుక పడలేదు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాలేదని విమర్శించారు. ఏమీ చేయకుండా ఐదు సంవత్సరాల కాలం గడిపి, రాష్ట్రానికి అప్పులు పెంచి తలకు రూ. 50 వేలు విధించాడని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు రూ. 3 వేల అప్పు ఉంటే రూ. 60 వేల కోట్లకు పెంచాడని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక బడ్జెట్ పెంచడమే కాకుండా అన్ని రంగాలను పరుగు పెట్టించాడని గుర్తు చేశారు. ఏమీ చేతగాని అసమర్థుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తన హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేసుకోవడం తప్ప రాష్ట్రంలో ఏ సంస్థలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ప్రజలెవరూ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరన్నారు. నవరత్నాలను దొంగిలించి ప్రజలకు మేలు చేస్తామని చెబుతున్నా.. ఎవరూ నమ్మడం లేదన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకుంటూ అతి దారుణమైన కుట్రలు ప్రయోగిస్తూ ముఖ్యమంత్రిగా ఉండడానికి చంద్రబాబు అర్హుడా అని ప్రశ్నించారు. నోటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి అర్థరాత్రి అమరావతికి పారిపోయి వచ్చాడని, రాజ్యాంగ విరుద్ధంగానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం చేయించాడు. బీజేపీ, చంద్రబాబు కుట్ర చేశారని స్పష్టమైందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన డేటాను తీసుకువెళ్లి సేవా మిత్ర అనే ప్రైవేట్ వ్యక్థులకు అప్పగించి వ్యక్తిగత వివరాలు బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 59 లక్షల ఓట్లను తొలగించి రెండు సంవత్సరాల నుంచి దుర్మార్గమైన ప్లాన్ చేస్తున్నారు. దానికి కారణమైన వాడిని దాచిపెట్టిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసే ముఖ్యమంత్రిని ఎపుడూ చూడలేదని, ఆంధ్రరాష్ట్రాన్ని ఇలాంటి దుర్మార్గుడు పాలించడం సిగ్గుచేటు అన్నారు. వీళ్ల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సినిమా రంగాన్ని తమ చుట్టూ తిప్పుకున్నారు. నలుగురిని పెట్టుకొని హీరోలందరినీ తమ చుట్టు తిప్పుకునే చంద్రబాబు.. సినిమా రంగంలోని వారంతా వైయస్ జగన్కు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పతనం ప్రారంభమైందని, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, వైయస్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.