చంద్రబాబు పాలనలో భగవంతునికి అపచారం...

ఆలయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు..

టీడీపీ పాలనలోనే దేవుళ్ల నగలు మాయమవుతాయి..

40 హిందూ ఆలయాలను కూల్చివేసిన ఘనపాఠి చంద్రబాబు..

 తిరుపతి: చంద్రబాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో కిరీటం మాయం దారుణమన్నారు. చంద్రబాబు పాలనలో ఆలయ సంప్రదాయాలకు,సంస్కృతి,ఆచారాలకు దారుణంగా విఘాతం కలుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంటే చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. భక్తిని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీటీడీలో దేవుళ్ల నగలు చంద్రబాబు పాలనలోనే మాయమవుతున్నాయన్నారు. గతంలో చంద్రబాబు పాలనలోనే బెజవాడ కనకదుర్గమ్మ కిరీటాన్ని కూడా మాయం చేశారని గుర్తు చేశారు. సుమారు తొమ్మిది నెలల క్రితం సాక్షాత్తూ శ్రీవారి ఆలయంలోనే అభరణాలు మాయమయ్యాయన్నారు. తరతరాలుగా వెంకటేశ్వరస్వామికి భక్తుల సమర్పించి విలువైన బంగారు నగలు దొంగించారని  ఆనాడు ప్రధాన అర్చకుడే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

భగవంతునికి సంబంధించిన పింక్‌ డైమండ్‌ను దొంగిలించారని. ఇతర దేశాలలో వేలంపాట కూడా పాడారనే ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ ఆరోపణలపై ఎటువంటి న్యాయవిచారణకు ప్రభుత్వం  ఆదేశించలేదన్నారు. చంద్రబాబు మీద ఆరోపణలు చేసినవారిని సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తారన్నారు. నా నగలు దొంగిలించారని  సాక్షాత్తూ దేవుడే చెప్పితే..దేవుడినే దోషిగా చెప్పగలిగే సమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో హైందవత్వానికి, ఆలయ  సంప్రదాయాలకు తీవ్రమైన నష్టకలుగుతుందని అనేక మంది స్వామీజీలు,మఠాధిపతులు పత్రికాముఖంగా ప్రకటించినా.. ఏమాత్రం ఖాతరు చేయలేదన్నారు. విజయవాడ చుట్టూపక్కల 40 హిందూ ఆలయాలను కూల్చివేసిన ఘనపాఠి చంద్రబాబు అని అన్నారు. 11వ శతాబ్దంలో మహ్మద్‌ గజనీ దండయాత్రలో కూడా ఇన్ని ఆలయాలను కూల్చలేదన్నారు.

12 వ శతాబ్దంలో ఘోరి పరిపాలనలో కూడా ఆలయాలు ఇంతగా సర్వ నాశనం కాలేదన్నారు. చంద్రబాబు పాలనలోనే ఆలయాలను భూస్థాపితం చేశారన్నారు. చంద్రబాబు అమరావతిలో అమరేశ్వరుడి దేవాలయపు సదావర్తి భూములను తన తాబేదారులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేసి పోరాటం చేస్తేగాని దానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రాలేదన్నారు. టీడీపీ కార్యకర్తలకు ధారదాత్తం చేసే కార్యక్రమాలు చేశారన్నారు. శ్రీకాళహస్తీ, కనకదుర్గమ్మ ఆలయాల్లో క్షుద్రపూజలు జరగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  క్షుద్రపూజ నిర్వహిస్తున్న  ఒక అర్చకుడ్ని  పట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవుళ్ల భూములను అప్పడల్లా వేలాది ఎకరాలను టీడీపీ కార్యకర్తలకు  కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. చిరువ్యాపారులపై ప్రతాపం చూపే టీటీడీ అధికారులు కోట్ల విలువైన కిరీటాలు మాయమవుతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. నగలు మాయమైన చోట సిసి కెమెరాలు కూడా పనిచేయడంలేదన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయంపై హైంధ‌వ మతాధికారులు ప్రశ్నించాలని కోరారు. 
 

Back to Top