‌నరకాసుర పాలనపై 'అడుగుల యుద్ధం'

హైదరాబాద్, 3 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. తీవ్రమైన ఎండలను, హోరున కురిసే వానలను, వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా శ్రీమతి షర్మిల ప్రతి ఒక్కరి తలుపునూ తట్టి, లక్షలాది మంది అభిమానులు, జనసమూమాల మధ్య పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ ఓదార్చి, భవిష్యత్తుపై ప్రజలకు ఆశాభావాన్ని కలిగిస్తూ ఆమె మరో ప్రజాప్రస్థానం కొనసాగిందని భూమన తెలిపారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో భూమన కరుణాకరరెడ్డి శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా మొత్తం 14 జిల్లాల్లోని 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, 45 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లు, 195 మండలాలు, 1750 గ్రామాల్లో నడిచారని భూమన వివరించారు. శ్రీమతి షర్మిల చేసిన ఈ సాహసోపేతమైన సుదీర్ఘ పాదయాత్రను చూసి ధరిత్రి కచ్చితంగా పులకించి ఉంటుందని భూమన అన్నారు. అంధకారం నింపిన నరకాసుర కాంగ్రెస్ పాలనపై అతివ శ్రీమతి షర్మిల సాగించిన 'అడుగుల యుద్ధం' అని ఆయన అభివర్ణించారు. ఇల్లు విడిచి, సుఖాలు మరిచి, పేటలు కడచి, అన్న మాట కోసం అడుగు బడుగు జీవుల బ్రతుకుల్లో వెలుగులు నింపడం కోసమని శ్రీమతి షర్మిల సాగించిన పాదయాత్రగా మరో ప్రజాప్రస్థానం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ.. కర్షకుల కన్నీళ్ళ వెతలు వింటూ.. చేతి వృత్తుల వారి చెమటను తుడుస్తూ.. నేతన్న జీవితాలకు భరోసా కల్పిస్తూ.. పల్లె పల్లెనూ పులకాంకితను చేస్తూ.. శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగిందన్నారు.

భారతదేశంలోనే ఇప్పటి వరకూ ఏ మహిళా 3,113 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేయలేదని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. అది కూడా ప్రజల కోసం, ప్రజల మధ్యన వారికి భరోసా కలిగిస్తూ.. ఈ రాక్షస ప్రభుత్వం చేస్తున్న ఘోరాతి ఘోరమైన తప్పిదాలను ఎండగడుతూ పాదయాత్రను శ్రీమతి షర్మిల కొనసాగించారన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని నిలదీస్తూ ప్రజల జేజేలు తీసుకుంటూ, జయజయ ధ్వానాల మధ్య కొనసాగిన సువర్ణ అధ్యాయంగా మిగలనున్నదన్నారు. రాదారిలో శ్రీమతి షర్మిలమ్మ కదలుతుంటే గోదారిలా జనం ఆమె వెంట నడిచారని, కష్టాలు కడతేర్చే రాజన్న కూతురు తమ మధ్యకు వస్తున్నదని కోట్లాది మంది కన్నీటి హారతులు ఇచ్చారని చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి లభించిన స్పందన అని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.

సుమారు 7 నెలల పాటు సుదీర్ఘంగా, అత్యంత ఆత్మీయంగా, అనురాగ, ప్రేమానుబంధాల మధ్య శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగిందని భూమన పేర్కొన్నారు. మహిళ అంటే ఇలా ఉండాలి అని ప్రతి మహిళా గర్వంగా భావించేలా, వారిలో ఒక ధైర్యాన్ని నింపి, రాజకీయాల్లో ఉన్నతోన్నమైన విలువలతో కష్టాలను సైతం ఇలా అధిగమించాలనే విధంగా శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని చూసి భరించలేక శ్రీమతి షర్మిల సమాజాన్ని నిద్రలేపిందని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. జగనన్న వదిలిన బాణం జనం గుండెల్లో నిండిన ప్రాణంగా మారి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నదన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీమతి షర్మిల పాదయాత్ర పరిసమాప్తి కాబోతున్నదని భూమన చెప్పారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రజల హృదయాల్లో ఎంతగా చిరస్థాయిగా నిలబడి కీర్తి శిఖరాలను అందుకున్నదో శ్రీమతి షర్మిల పాదయాత్ర కూడా అందరి మనస్సులను చూరగొన్నదన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో భవిష్యత్తు పట్ల సంపూర్ణమైన నమ్మకంతో వారు ఇచ్చిన ధైర్యంతో ప్రజల కళ్ళలో వెలుగులు నింపుతూ కొనసాగిందని అభివర్ణించారు. ఆనాడు 'రుద్రమ్మ భుజశక్తి' చెప్పుకున్నట్లే.. ఈనాడు శ్రీమతి 'షర్మిలమ్మ పదశక్తి' అని ఈ పాదయాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో 'నభూతో నభవిష్యతి' అనే విధంగా బహిరంగ సభ విజయవంతంగా జరగబోతోందని భూమన తెలిపారు.

కాంగ్రెస్, దానికి కొమ్ము కాస్తున్న టిడిపిని ఎండగడుతూ.. ప్రజలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పిస్తూ.. భవిష్యత్తు పట్ల వారికి ఆశాభావాన్ని కల్పిస్తూ.. సాగిన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సంపూర్ణమైన లక్ష్యాన్ని సాధించిందని ఒక ప్రశ్నకు భూమన సమాధానం చెప్పారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిశాచరుడుగా రాత్రిళ్లు అవహేళన పాదయాత్ర చేశారన్నారు. నిద్రలేమితో బాధపడే చంద్రబాబు రాత్రి పడుకునే ప్రజలకు నిద్రా భంగం కల్గిస్తూ ఇబ్బందికి గురిచేశారన్నారు. తాను నిద్రపోను.. ఇతరులను నిద్రపోనివ్వనని ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను పాదయాత్ర సందర్భంగా అక్షరాలా అమలులో పెట్టారని ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఏ రైతు కడగండ్లనూ చూసే అవకాశం లేదన్నారు. ఎండిన పొలాన్ని పరిశీలించే పరిస్థితి లేదన్నారు. నీరు లేని ఏ కాలువనూ పరీక్షించే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.

Back to Top