కృష్ణా జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

హైదరాబాద్‌, 12 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం సాయంత్రం కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. తెలుగుదేశం పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు), టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలగిన ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, వీవీఆర్ హౌసింగ్‌ సంస్థ అధినేత వాకా వాసుదేవరావు తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరుతున్న సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొంటారని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురా‌మ్, కృష్ణా జిల్లా పార్టీ ‌అ‌డ్‌హాక్ కమిటీ కన్వీన‌ర్ సామినేని ఉదయభాను సంయుక్త ప్రకటనలో తెలిపారు. 

బుధవారం సాయంత్రం 4 గంటలకు విజయమ్మ హైదరాబా‌ద్ నుంచి విమానంలో బయలుదే‌రి 5 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్రుకు 6 గంటలకు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు వెళ్లి అక్కడ ఇటీవల పెద్దపులిపాక వద్ద కృష్ణానదిలో మునిగి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తరువాత విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని హైదరాబాద్ ‌వస్తారు.
Back to Top