దళిత, గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్­

వైయస్­ఆర్­ కాంగ్రెస్ పార్టీ డిమాండ్­

ఎన్ని కమిటీలు, నివేదికలు ఇచ్చినా ఫలితముండదు

హైదరాబాద్, 26 ఆగస్టు 2012: రాష్ట్రంలోని దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా బడ్జెట్­ కేటాయించాలని వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ నేతలు డిమాండ్­ చేశారు. అలా అయితేనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. లేకపోతే ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని నివేదికలు వచ్చినా ఫలితం ఉండదని వారు స్పష్టంచేశారు. వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు, మూలింటి మారెప్ప, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్­ నల్లా సూర్యప్రకాష్­రావు, పార్టీ నేత ఎస్సీ, ఎస్టీ కమిషన్­ మాజీ చైర్మన్­ మేరుగ నాగార్జున ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నోడల్­ ఏజెన్సీని బుట్టదాఖలు చేశారు :

గడచిన 30 సంవత్సరాలుగా ఎన్ని కమిటీలు నివేదికలు రూపొందించినా అవేవీ దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడలేదని జూపూడి ఆరోపించారు. ప్రణాళికా సంఘం సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని దుయ్యబట్టారు. దళిత, గిరిజనుల నిధులు పక్కదారి పట్టవద్దనే సదుద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్­ రాజశేఖరరెడ్డి నోడల్­ ఏజెన్సీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అయితే దాన్ని ఆచరణ రూపంలోకి తెచ్చే సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయన ఆకస్మికంగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్­ప్లాన్­ నిధులపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సుల్లో లోపాలున్నాయని జూపూడి అన్నారు. ఉపసంఘం నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సబ్­ప్లాన్­ నిధులు పక్కదారి పడితే అందుకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ నివేదికలో ఎక్కడా పొందుపర్చకపోవటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్­కుమార్­రెడ్డికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక బడ్జెట్­ ప్రకటించాలని డిమాండ్­ చేశారు. ఇప్పటి వరకూ దారిమళ్లిన 23 వేల కోట్ల రూపాయలను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలని జూపూడి విజ్ఞప్తి చేశారు.

భూపంపిణీ ఏమైంది?:

దళితులు వైయస్­ఆర్­ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారనే అసూయతో వారిని నిలువరించేందుకు సీఎం కిరణ్­ మోసపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని మారెప్ప విమర్శించారు. దళితుల పట్ల సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వారంలోగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని డిమాండ్­ చేశారు. దళితులు వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని దివంగత వైయస్­ ఆకాంక్షించి ఎటువంటి పూచీకత్తూ లేకుండా రూ. 5 కోట్ల వరకూ మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. సుమారు ఐదు లక్షల మంది దళితులకు వైయస్­ ఏడు లక్షల ఎకరాల భూమిని అందజేశారని వెల్లడించారు. అయితే ఆయన రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ పాలకులు మాత్రం ఆ కార్యక్రమానికి పూర్తిగా తిలోదకాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ కమిషన్­కు చైర్మన్­ను నియమించలేకపోయారన్నారు. రాష్ట్రంలో మళ్లీ వై.యస్­.జగన్మోహన్­రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మారెప్ప అభిప్రాయపడ్డారు.

దళితులకు గృహ నిర్మాణాలు ఎక్కడ?:

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్­ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులు ఆర్థికాభివృద్ధి సాధించారని నల్లా సూర్యప్రకాష్­రావు పేర్కొన్నారు. గృహనిర్మాణాల విషయంలో వైయస్­ దళితులకు దాదాపు 18 లక్షల ఇళ్లు కేటాయించారని వివరించారు. వైయస్­ మరణించి మూడేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా భూపంపిణీ చేయలేదని ఆయన విమర్శించారు. సీఎం కిరణ్­ దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని సూర్యప్రకాష్­రావు మండిపడ్డారు. దళితులు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక బడ్జెట్­కు మించింది మరొకటి లేదని నాగార్జున పేర్కొన్నారు.

Back to Top