నగరంలో ‘నవరత్నాల’ సన్నాహక సమావేశం

-వైయస్సార్‌ సీపీ బూత్, గ్రామ కమిటీ అధ్యక్షులకు శిక్షణ
పి.గన్నవరం : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్న పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని గ్రామ, బూత్‌ కమిటీల అధ్యక్షులకు నగరం గ్రామంలోని తన నివాసం వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్టీ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు తెలిపారు. పి.గన్నవరం శివారు చిట్టిలంక పేటలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు నివాసం వద్ద శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 208 బూత్‌ కమిటీలు, 68 గ్రామ కమిటీల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఆయా కమిటీల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. నవరత్న కార్యక్రమంలో ప్రజలకు పంపిణీ చేసేందుకు అవసరమైన మెటీరియల్‌ను అందజేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వాసంశెట్టి చినబాబు, మట్టపర్తి శ్రీనివాస్, నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, దొమ్మేటి వెంకట శివరామన్, తోలేటి బంగారు నాయుడు, యన్నాబత్తుల ఆనంద్, అడ్డగళ్ల శ్రీను, పిల్లి కన్నబాబు, పుచ్చకాయల ఏసు, దేవగుప్తం వెంకటేశ్వరరావు, జంగా చంద్రమౌళి, కొండేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top