పశ్చిమగోదావరి : ఏపీలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి..అందులో భాగమైన ప్రతిపైసాను కక్కిస్తామని వైయస్ఆర్సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గ బూత్స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒక కేంద్రమంత్రిపై జరిగిన ఈడీ సోదాల్లో టీడీపీ అవినీతి సొమ్ము బయటపడటమ దోపిడీతనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.<br/>సీఎం మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర అభివృద్ది కాకుండా దోచుకోవడమే పనిగా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తాముచేస్తున్న దోపిడీ బయటపడుతుందనే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా ఎక్కడా లేనటువంటి జీవోలను జారీ చేశారని విమర్శించారు. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ది శూన్యమని.. ఇసుక దోపిడీలో మాత్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దిపై కాకుండా వ్యక్తుల అభివృద్దిపై టీడీపీ శ్రద్ద చూపిస్తుందని ఎద్దేవాచేశారు. టీడీపీ తన మనుగడుకు ఎంతకైగా దిగజారుతుందని.. అందుకు కాంగ్రెస్తో పొత్తే నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేరును తెలుగు దోపిడీ పార్టీగా మార్చుకుంటే మంచిదని విమర్శించారు. <br/><br/>