ఆయన వచ్చాడు.. మహిళలకు రక్షణ లేదు

- దాచేపల్లి బాలికపై అత్యాచార ఘటన బాధాకరం
- బాధిత కుటుంబానికి వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది
- చంద్రబాబు పాలనలో మహిళలు, పసిపిల్లలపై దాడులు పెచ్చుమీరాయి
- ఏడీఆర్‌ రిపోర్టు ప్రకారం మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్‌ వన్‌
- అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవా..?
- అవినీతిపై సాధారణ కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా బాబు జైలుకే
హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఆయన వస్తేనే మహిళలకు రక్షణ అని ప్రకటనలతో ఊదరగొట్టిన చంద్రబాబు నాలుగేళ్లుగా మహిళలు, పసిపిల్లలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మ‌న ఖ‌ర్మ‌కొద్ది ఆయ‌న వ‌చ్చాడు..అప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడడం దారుణమన్నారు. బాలికకు, బాధిత కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సామాజిక ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటన మరువక ముందే.. మరో సంఘటన జరగడం బాధాకరమన్నారు. రాజధాని ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళలకు సెల్‌ఫోన్‌లు, రక్షణకు షీటీమ్‌లన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 

నాలుగేళ్లుగా మహిళలపై నేరాల్లో, మహిళ అక్రమ రవాణాలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏడీఆర్‌ నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు టీడీపీ వారేనని, వారిలో ఇద్దరు కీలక మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు జరిగాయని, రాజధాని ప్రాంతంలో అత్యాచార ఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలకు కొత్త సంస్కృతి నేర్పిస్తున్నారన్నారు. 

విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు టీడీపీ పెద్ద తలకాయల అండదండలు ఇస్తే చంద్రబాబు మద్దతు తెలిపారని, అందుకే ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లు మృగాళ్లుగా మారి పసిపిల్లలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో పడేసి దాడి చేస్తే టీడీపీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు ఆ రోజే టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని ఉండే ఈ రోజు రేపు సంఘటనలు జరిగేవి కావన్నారు. మైనర్లపై అత్యాచారాలు జరిగితే టీడీపీ నేతలు చంద్రబాబును అనుసరిస్తూ పోలీస్‌ స్టేషన్‌లలో రాజీలు చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతుంటే పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. నాలుగేళ్లుగా జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లలో ఏ ఒక్కసారైనా మహిళల భద్రత అంశంపై చర్చించిన పాపాన పోలేదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. 

చంద్రబాబు సర్కార్‌ నాలుగేళ్లుగా రాష్ట్రంలో చేసిన అవినీతిపై ఒక సాధారణ కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా జీవితాంతం జైల్లో ఉంటారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ప్రజాసమస్యలపై లేదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశాలు అన్ని భూ సంతర్పణల కోసమే జరిగాయని అన్నారు. కర్నూలులో 161 ఎకరా  భూమిని కారుచౌకగా రూ. 3 లక్షలకు ఎకరా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటివరకూ కేబినేట్‌ సమావేశాలన్నీ భూ సంతర్పణకేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని నిరుద్యోగ భృతి చంద్రబాబుకు ఇవాళ గుర్తుకు వచ్చిందన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకుపై వైయస్‌ఆర్‌ సీపీ మొదటి నుంచి అంటున్న పది అంశాలపై విచారణ జరిపించాలన్నారు. కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా జైలు కెళ్లడం ఖాయమన్నారు. 

Back to Top