పెన్షన్లకు కోతపెట్టి వృద్ధుల కడుపు కొట్టొద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రకరకాల షరతులు విధించి ఏదోరకంగా సంక్షేమ పథకాలకు కోత పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు విధానంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. వృద్ధులకు పింఛన్లను అందకుండా చేయడానికే తాజాగా పింఛన్ల జీవో తెచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నష్టం చేకూర్చే 135 వ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో వృద్ధాప్య పింఛన్లను వెయ్యి రూపాయలు చేస్తానని ఆశపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తీరా ఎన్నికలయ్యాక, సమీక్ష పేరుతో పింఛన్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘జీవో 135 ప్రకారం పింఛన్ల సమీక్షా కమిటీలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మునిసిపల్ చైర్మన్లు, మేయర్లతోపాటుగా ఇద్దరు స్వయం సహాయక గ్రూపు వారు, మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారని పేర్కొన్నారు. సహాయక గ్రూపులు, సామాజిక కార్యకర్తల పేరుతో సమీక్షా కమిటీలను టీడీపీ వారితో నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. హడావిడిగా జీవోను జారీచేసి 19, 20 తేదీల్లోపు కమిటీలు సమావేశమై పింఛను లబ్ధిదారులను సమీక్షించాలని నిర్ణయించడం అన్యాయం. అక్టోబర్ 2 నుంచి పెన్షన్ల మహోత్సవమంటూ దానికి ముందు సమీక్ష పేరుతో వృద్ధుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. ఇది జాతర ముందు బలివ్వడంలా ఉంది. రూ.200 స్వల్పమొత్తాన్నికూడావృద్ధులకు అందకుండా చేయడం దారుణం. ఇప్పటికే 15 లక్షల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నావాటి గురించి ఆలోచించకుండా ఉన్నవాటిని తొలగించాలని చూడటం విచిత్రం.

పింఛన్లు అదనంగా పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తే వారిని తొలగించడానికి అధికారులతో ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా చేయాలి తప్పితే ఇలా హేతురహితంగా కమిటీలను నియమించడమేమిటి? ’’ అని పద్మ మండిపడ్డారు. రుణమాఫీకి చందాలంటూ... రైతుల ఆత్మగౌరవాన్నికించపరుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్నిఎద్దేవాచేశారు. బిచ్చమెత్తుకుని అప్పులు తీర్చాలంటే ఏ రైతూ అంగీకరించడని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Back to Top