టీడీపీ నేతలకు బుగ్గన సవాల్‌

ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాలకు సిద్ధమా..?
దమ్ముంటే సవాల్‌ స్వీకరించాలి

కర్నూలు: టీడీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే.. రాజీనామాలకు సిద్ధమా అంటూ పీఏసీ చైర్మన్, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తన హక్కులు, ప్రతిష్టకు టీడీపీ నేతలు భంగం కలిగిస్తున్నారని బుగ్గన అసెంబ్లీ స్పీకర్‌కు, సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. సభ హక్కుల ఉల్లంఘన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బుగ్గన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బీజేపీ నాయకులకు అందజేస్తున్నానని తనపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. టీడీపీ అభియోగాలపై తేల్చుకునేందుకు తన పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆరోపణలు చేసిన వారు దమ్ముంటే సవాల్‌ స్వీకరించి రుజువు చేయాలన్నారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్న తనపై నిరాధార ఆరోపణలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు పార్టీ ఇప్పుడు వైయస్‌ఆర్‌ సీపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని, వైయస్‌ఆర్‌ సీపీకి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంపై బురదజల్లుతూ బీజేపీతో నేటికీ చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారన్నారు. 
 
Back to Top