మూడున్నరేళ్లుగా ముస్లింలు కనబడలేదా...!

– వక్ఫ్‌ ఆస్తులను పంచుకుంటున్న టీడీపీ నేతలు
– వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ నాయకుల ధ్వజం
కడప కార్పొరేషన్‌: తెలుగుదేశం ప్రభుత్వానికి మూడున్నరేళ్లుగా ముస్లిం, మైనార్టీలు కనిపించలేదని, ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలనే పేరు మార్చారు తప్ప... కొత్త పథకం ఒక్కటైనా ప్రవేశపెట్టారా అని టీడీపీని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్నా ఏ ప్రభుత్వం కూడ ముస్లిం మైనార్టీలను పట్టించుకున్నది లేదని....దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఆదుకున్నారన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం వల్ల ఎంతోమంది ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. జిల్లాలో రూ.500 కోట్లకు పైగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులను తెలుగు తమ్ముళ్లు పంచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. వాడుకొని వదిలేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటి మొఖం కూడా చూడలేదని విమర్శించారు. ఏడాదిన్నర పూర్తవుతున్నా హజ్‌హౌస్‌ పనులు పూర్తి కాలేదని, యునాని హాస్పిటల్‌ అడ్రస్‌ లేదన్నారు. వీటిని ప్రజలు మరిచిపోరని, తగిన సమయంలో టీడీపీకి బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనార్టీ నగర అధికార ప్రతినిధి అతావుల్లా, నగర ప్రధాన కార్యదర్శులు ఆయుబ్‌ఖాన్, గౌస్, షబ్బీర్, డిష్‌ జిలాన్‌ పాల్గొన్నారు.
Back to Top