హైదరాబాద్: నేడు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వైయస్సార్సీపీ వర్గాలు తెలిపాయి.జిల్లా, మండల కేంద్రాల్లో....పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.