<br/> ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఈ మేరకు కేంద్రంపై ఈ నెల 16న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉండటంతో ఈ విషయంపై వైయస్ జగన్తో పార్టీ ఎంపీలు మాట్లాడారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుగా భావించామని, అయితే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉండటంతో రేపే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకాలని కోరుతూ అన్ని పార్టీలకు వైయస్ జగన్ లేఖలు రాశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని నేపథ్యంలో, తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని వైయస్ జగన్ లేఖలో కోరారని చెప్పారు. సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన రోజు ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.