ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే

అసెంబ్లీః కాల్ మనీ సెక్స్ రాకెట్
అనేది చాలా హేయమైన వ్యవహారం అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీ
సమావేశాల మొదటి రోజున వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీ
దాకా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చర్యల్ని
తీవ్రంగా దుయ్యబట్టారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది హేయమైన చర్యఅని, దీనికి
ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. గుంజీలు తీసినా ఆ పాపం పోదని ఆయన
అన్నారు. 

విజయవాడ కేంద్రంగా సాగుతున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో  ఆడవాళ్లను ఆట వస్తువులుగా ఉపయోగించుకుని సెక్స్ రాకెట్‌కు పాల్పడితే, అందులో కూడా చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఇంతమంది కనిపిస్తుంటే దీన్ని దారి మళ్లించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇదేదో వడ్డీ వ్యాపారం అన్నట్లు వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేస్తున్నారు. వందల మందిని అరెస్టు చేస్తారు.. వాళ్లలో కూడా ప్రతిపక్షాల వాల్లే ఎక్కువ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.

విజయవాడలో సీఎం అండదండలతో, నేరుగా డీజీ ఇంటెలిజెన్స్‌తో నిందితులు చర్చలు జరుపుతున్న ఫొటోలు కూడా ఉండగా, ఎమ్మెల్యే విదేశీ పర్యటనకు వెళ్లడం, ఆయనతోపాటు ఉన్న నిందితుడు మాత్రం తిరిగి రాకపోవడం చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి సొంత తమ్ముడే ఈ వ్యాపారం చేస్తున్నాడు. 200 లకు పైగా వీడియో టేపులలో అమ్మాయిలను అశ్లీల చిత్రాలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేశారు. కాల్ మనీలో  సీఎం డబ్బులు ఉన్నాయి కాబట్టే సెక్స్ రాకెట్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇది కేవలం వడ్డీ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు దాడులు చేయిస్తున్నారన్నారు. సాదా సీదా కేసుగా చిత్రీకరించే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది.

అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు లోపలకు తీసుకురావద్దంటూ వారికి ఆంక్షలు పెట్టారు. దీంతో వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతోందని, అసెంబ్లీ జరిపించుకుంటారా లేదా అన్న విషయాన్ని ఆయనకే వదిలిపెడతామని ఆయన అన్నారు. పోలీసులకు, ప్రతిపక్ష నేతకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చీఫ్ మార్షల్ బయటకు వచ్చి పోలీసులకు నచ్చజెప్పిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించారు.


Back to Top