అనంతపురం: దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని వైయస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ను మూగ, చెవుడుతో బాధపడుతున్న చి న్నారి తల్లిదండ్రులు రామసాగరం గ్రామంలో కలిశారు. తమ బిడ్డ మూగ, చెవుడుతో బాధపడుతుంటే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని తల్లిదండ్రులు వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. అనుష్క అనే ఆరు సంవత్సరాల పాపకు మూగ, చెవుడు ఉంది. కాంక్లియర్ ఇన్ఫ్లాంటేషన్ ఆపరేషన్ చేయించాలని అనంతపురం, తిరుపతికి వెళ్తే రూ. 3 లక్షల ఆపరేషన్కు ఖర్చు అవుతుందని, ఈ ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ వర్తించదని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంత డబ్బు లేక ఆపరేషన్ చేయించడం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఓ తల్లి ఆవేదనను చూసి వైయస్ జగన్ చలించిపోయారు. కడు పేదరికం, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొని ఉచితంగా వైద్యం చేయిస్తామని, ఏ ఆపరేషన్ అయినా ఉచితంగానే చేయిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు చెల్లిస్తామని మాట ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలని నినదించారు.