అన్నదాతలకు అండగా ఉంటా

–  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
– చంద్రబాబు ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది
– మంచి రోజులు వస్తాయని హామీ

కర్నూలు: వరుస మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అన్నదాతలకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో తమ గ్రామానికి వచ్చిన జననేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అన్నదాతలు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. గురువారం భాగ్యనగరం గ్రామానికి చెందిన రైతు బాలిరెడ్డి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వైయస్‌ జగన్‌తో వెల్లబోసుకున్నారు. విత్తనాలు, మద్దతు ధర, దిగుబడులపై జననేత ఆరా తీశారు. కనీస మద్దతు ధర లేదని రైతులు వాపోయారు. పత్తిని రూ.3 వేలకు కూడా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని రైతులు పేర్కొన్నారు. ఏ పంటకు గిట్టు బాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో జొన్న పంట తప్ప మిగతా ఏ పంటకు మద్దతు ధర లేదని మొర పెట్టుకుంటున్నారు.  పప్పు ధాన్యాలు, మినుపు, పెసరాకు కూడా గిట్టుబాటు ధర లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర దేవుడేరుగు కనీసం మద్దతు ధర లేదని చెప్పారు. దీనికి తోడు  అతివృష్టి, అనావృష్టితో ఇబ్బందులు పడుతున్నామని రైతులు పేర్కొన్నారు.  ఏటేటా సాగు విస్తిర్ణం తగ్గింది. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. ఇన్స్‌రెన్సు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని తెలిపారు. ధరల స్థీరికరణ ఏమైందో చంద్రబాబుకే తెలియాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, మన ప్రభుత్వం వచ్చాక రైతులను అన్ని విధాల ఆదుకుంటానని జననేత హామీ ఇచ్చారు.
 
Back to Top