యూఏఈ బాధితులపై ప్రభుత్వం చిన్నచూపు: రెహ్మాన్

హైదరాబాద్:

యునెటైడ్ అరబ్ ఎమిరేట్సు(యూఏఈ)లో చిక్కుకున్న తెలుగువారిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్‌ఏ రెహ్మాన్ ఆరోపించారు. అధికారికంగా పాస్‌పోర్టు, వీసాలు లేకుండా పట్టుబడినవారిని స్వదేశానికి పంపించేందుకు యూఏఈ ప్రభుత్వం ‘ఆమ్నెస్టీ’ ద్వారా అవకాశం కల్పించినప్పటికీ పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. ప్రజాపక్షంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలువురు దాతల సాయం తీసుకొని యూఏఈలో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తెస్తోందని తెలిపారు. తొలివిడతలో 50 మందికి, రెండో విడతలో 35 మందికి విమాన టికెట్లు అందజేసినట్లు ఆయన వివరించారు. యూఏఈలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు తాను అక్కడకు వెళ్లినట్లు చెప్పారు. దళారుల మోసాల కారణంగా దుబాయిలో తెలుగువారు పడుతున్న వెతలు తనకు కన్నీళ్లు తెప్పించాయని రెహ్మాన్ ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి గురించి అక్కడి అధికారులతో చర్చించాననీ,  వారు కూడా సానుకూలంగా స్పందించారనీ వివరించారు. ఇప్పటికైనా దళారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. యూఏఈ పర్యటనలో తనతోపాటు ఎన్నారై విభాగం నేతలు ప్రసాద్, రమేష్‌రెడ్డి, పెద్దిశెట్టి ప్రసాద్, శామ్యూల్, హర్షవర్ధన్‌రెడ్డి, హసన్, చెన్నరెడ్డి, ఫారుక్, జోసఫ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Back to Top