హైదరాబాద్, 5 సెప్టెంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేయనున్న నిరాహార దీక్షకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలన్న డిమాండ్తో విజయమ్మ గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. విజయమ్మ ఫీజు పోరు దీక్షా స్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారంనాడు పార్టీ సీనియర్ నాయకులు దగ్గరే ఉండి పర్యవేక్షించారు.గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే సమస్యపై వైయస్ జగన్మోహన్రెడ్డి ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఫీజు రీయింబర్సుమెంట్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే దారుల కోసం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. నిరుపేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయాలన్న కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నది.ఫీజు రీయంబర్సుమెంట్పై కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, పది వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఈ సౌకర్యాన్ని అమలు చేస్తామని, బీసీ విద్యార్థులకైతే వారి కుటుంబ ఆదాయం లక్ష రూపాయల వార్షికాదాయం ఉంటేనే అర్హులని ఇలా సవా లక్షల నిబంధనాలు విధించింది. విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే ఇలాంటి కుట్రపూరిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, వైయస్ అమలు చేసిన విధంగానే యధాతధంగా అమలు చేయాలంటూ విజయమ్మ రెండు రోజుల ఫీజు పోరు దీక్షకు సిద్ధమయ్యారు.