మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం

హైదరాబాద్:

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రకటించిన సీమాంధ్ర లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా చాలా స్పష్టంగా ఉందని, పార్టీకి, ప్రజలకు సేవలందించే అభ్యర్థులకే చోటు లభించిందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు.

అభ్యర్థుల జాబితాలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకుడు అందరికీ ప్రాధాన్యం లభించేలా చూశారని పద్మ అన్నారు. తొలి నుంచీ ఊహించిన విధంగానే జాబితాలో అభ్యర్థుల పేర్లున్నాయన్నారు. ఈ జాబితాలో ఇటీవల పార్టీలో చేరిన కరణం ధర్మశ్రీ, బూరగడ్డ వేదవ్యాస్, తాజా మాజీ మంత్రి పార్థసారథిలకు ప్రాధాన్యత లభించిందన్న విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ప్రజలకు సేవలందించే క్రమంలో ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించినట్లు చెప్పారు. ఒకరిద్దరు తప్పితే అంతా పాతవాళ్లకే టికెట్లు లభించాయన్నారు. మిగిలి ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారన్నారు.

విశాఖపట్నం లోక్‌సభా స్థానం నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పోటీ చేయటం గురించి మీడియా ప్రస్తావించినప్పుడు.. ఆమె పోటీ చేయాలని విశాఖ ప్రజలు పట్టుబట్టారని, అందువల్లే ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని పద్మ వివరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఈ జాబితాలో చోటు దక్కలేదన్న విలేకరుల ప్రశ్నకు పద్మ సమాధాన మిస్తూ ఈ విషయం ఇదివరకే శ్రీమతి షర్మిల స్పష్టం చేశారని, తన కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువు నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని చెప్పారని తెలిపారు.

అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు రామకృష్ణ తమ్ముడు కొణతాల రఘును బరిలోకి దింపామన్నారు. ఒకేసారి దాదాపు అన్ని స్థానాలకూ జాబితా విడుదల చేయటం పట్ల పద్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే విజయం అన్నారు.

Back to Top