వైఎస్సార్‌సీపీలోకి జిట్టా

హైదరాబాద్: తెలంగాణ యువ జేఏసీ చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆయన ఆమె నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభిమతాన్ని వెల్లడించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన భువనగిరిలో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి విజయమ్మ సమక్షంలో తాను, తన అనుచరులు పార్టీలో చేరతామని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది కేంద్రమే కనుక వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తుచేశారు. మూడున్నర ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న తనకు ఒక అండ కావాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. కె.కె.మహేందర్‌రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి వంటి తెలంగాణ నాయకులు ఇదివరకే పార్టీలో ఉన్నారని, భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం కృషి చేస్తూనే పార్టీలో కొనసాగుతానని తెలిపారు. త్వరలో తెలంగాణ ఏర్పాటవుతుందనే విశ్వాసం తమకుందని, ఆర్టికల్-3 ప్రకారం కేంద్రమే తెలంగాణ ఏర్పాటు చేయాలని కేసీఆర్ కూడా చెబుతున్నారని ఆయన చెప్పారు.

వైయస్ అభిమానులు తెలంగాణలోనూ ఉన్నారు

దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి అభిమానులు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారందరూ వైయస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారని పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో కొండా సురేఖకు వచ్చిన ఓట్లను బట్టి ఈ విషయం వెల్లడైందన్నారు. వైయస్ పథకాలన్నీ కుంటుపడుతున్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమన్నారు. రేపు తెలంగాణ ఏర్పడినా ఇక్కడ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర నిర్వహించి ఒక జాతీయ పార్టీగా పరిణమిస్తుందని చెప్పారు. నల్లగొండ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డితో పాటు పలువురు జిల్లా నాయకులు విజయమ్మను కలిసిన వారిలో ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top