‘తూర్పు’కు అన్నొస్తున్నాడు



-  నేడు  తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- గోదావ‌రి బ్రిడ్జిపై జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భారీ ఏర్పాట్లు
- రాజ‌న్న బిడ్డ కోసం ఎదురు చూస్తున్న జిల్లావాసులు
తూర్పు గోదావ‌రి:  చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేడు తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంది.  వైయ‌స్ జగన్‌ ‘ప్రజా సంకల్ప’ పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు  పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాదయాత్ర, రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి వద్ద స్వాగత కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేశాయి. జననేత వైయ‌స్‌ జగన్‌ రాక సందర్భంగా ఈ బ్రిడ్జిని పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో సుందరంగా అలంకరించారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున 600 పడవలు పార్టీ జెండాలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టారు. జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాజమహేంద్రవరం వద్ద బ్రిడ్జి ప్రారంభంలో కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతంలో మూడంచెల వేదిక ఏర్పాటు చేస్తున్నారు.

స‌ర్వం సిద్ధం
వైయ‌స్ జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. జ‌న‌నేత‌కు 30 మంది బాలికలు వీణల ద్వారా స్వాగతం చెప్పనున్నారు. 108 మందితో తీన్‌మార్‌ డ్యాన్సులు, 30 మంది మహిళా తీన్‌మార్‌ నృత్యాలు, 108 మందితో గారడీ నృత్యాలు, 108 మందితో గరగ నృత్యాలు, 108 డప్పు వాయిద్యాలతో సందడి చేయనున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలపైన కొమ్ము డ్యాన్స్‌లు, తప్పెటగుళ్లు కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. 108 మంది చీరలు, తలపాగాలు ధరించి పార్టీ భారీ జెండాలు చేబూని, మరో 108 పాల సైకిళ్లు, 108 మంది మహిళలు కలశాలతో ఎదురేగి స్వాగతం పలకనున్నారు. పాదయాత్ర పొడవునా బాణసంచా కాల్చనున్నారు. పారాచూట్‌లతో పార్టీ జెండాలు ఆకాశంలోకి ఎగురవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిడ్జిపై వైయ‌స్‌ జగన్, ఆయన వెంట ప్రజలు నడుస్తుండగా వెనుక 25 అడుగుల వైయ‌స్‌ జగన్‌ కటౌట్‌ వాహనంలో వచ్చేలా ఘన స్వాగతం పలికేందుకు రాజమహేంద్రి సిద్ధమైంది.

కోటిపల్లి బస్టాండ్ లో బహిరంగ సభ
మధ్యాహ్నం రెండు గంటలకు కొవ్వూరు నుంచి బయలుదేరే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర మూడు గంటలకు రాజమహేంద్రవరం చేరనుంది. కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతంలోని పాల్‌చౌక్‌లో బహిరంగ సభ నిర్వహణకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే  బిపిన్‌ చంద్రపాల్, గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, టంగుటూరు ప్రకాశం పంతులు వంటి స్వాతంత్య్ర సమరయోధులు తెల్లదొరపై గొంతెత్తి, ప్రజలను స్వాతంత్య్రం సాధన దిశగా ఉత్తేజితులను చేశారు. ‘భరత ఖండంబు చక్కని పాడియావు.. హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ.. తెల్లవారను గడుసరి గొల్లవారు.. పితుకుతున్నారు మూతులు బిగియగట్టీ..’ అంటూ బ్రిటిషువారి దోపిడీని పద్యం రూపంలో కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం పాల్‌చౌక్‌ నుంచే వినిపించారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అంటూ స్వాతంత్ర కాంక్షను జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ ఈ వేదిక నుంచే విని పించారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన పాల్‌చౌక్‌ నుంచి బహిరంగ సభ ద్వారా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత పాలకులు రాజ్యాంగ సంస్థలను ఖూనీ చేస్తూ, ప్రజా వ్యతిరేక, దోపిడీ పాలన సాగిస్తున్న తీరుపై అశేష ప్రజలనుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Back to Top