విజయవాడ: కృష్ణా జిల్లాలో వైయస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన తెలుగు యువత నాయకులు వాసు, ఇబ్రహీంపట్నం ఉప సర్పంచ్ కనకదుర్గా వైయస్ఆర్సీపీలో చేరారు. వీరితో పాటు మరికొంత టీడీపీ నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వీరు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టీలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన ఏ ఒక్క వాగ్ధానం కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఊసేలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..వైయస్ఆర్సీపీ వెంట ఉద్యమించాలని తీర్మానించుకున్నట్లు చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటాలకు ఆకర్శితులమై వైయస్ఆర్సీపీలో చేరినట్లు వాసు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.