తెలంగాణలోకి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం'

పుల్లూరు (ఆలంపూర్ నియోజకవర్గం) 22 నవంబర్ 2012 : అఖండ జననీరాజనం మధ్య మహబూబ్‌నగర్‌ జిల్లా పుల్లూరు మీదుగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. జనసంద్రమైన తుంగభద్ర వంతెన మీదుగా షర్మిల పాలమూరు జిల్లాలోకి ప్రవేశించారు. వేలాది మంది వెంట నడువగా పుల్లూరు క్రాస్‌రోడ్ వద్ద షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. షర్మిల తెలంగాణ ప్రవేశంతో ఆ ప్రాంతమంతా జనసముద్రాన్ని తలపించింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూలవాన కురిపించగా, వైయస్ఆర్ సీపీ శ్రేణులు బాణసంచా పేల్చాయి. డప్పులతో, ఆటపాటలతో, సంప్రదాయ నృత్యాలతో, హారతులతో ఎదురేగి తెలంగాణ షర్మిలకు ఘనస్వాగతం పలికింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. షర్మిలకు స్వాగతం పలికేందుకు వివిధ తెలంగాణ జిల్లాల నుండి పెద్దయెత్తున జనం తరలి వచ్చారు. ఈ జన ఘనస్వాగతంతో పాదయాత్రకు తెలంగాణ బ్రహ్మరథం పట్టింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పుల్లూరు వద్ద షర్మిలతో కలిసి సభలో పాల్గొంటారు. కాగా ఇప్పటి వరకూ పాదయాత్రలో 466 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు.

Back to Top