టీడీపీ వాపును చూసి బలుపు అనుకుంటోంది

పలమనేరు: తాను పార్టీ మారుతున్నట్టుగా కొన్ని టీవీ చానళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వైయస్సార్సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. కావాలనే ఆ చానళ్లు పనిగట్టుకొని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంతవరకూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంటే నడుస్తానని  సునీల్‌కుమార్‌ స్పష్టం చేశారు. వారేదో ప్రత్యక్ష్యంగా చూసినట్టు తాను నియోజకవర్గ నాయకులతో సంప్రదిస్తున్నానని నిరాధారమైన విషయాలను టీవీలో చూపెట్టడం సమంజసం కాదన్నారు. త్వరలో నవరత్నాలతో తమ అధినేత ప్రజల్లోకి వస్తున్నారని, దీన్ని చూసి భయపడే అధికారపార్టీ ఇలాంటి నీచమైన మైండ్‌గేమ్‌లకు పాల్పడుతోందని విమర్శించారు.

దానికి తోడు పచ్చటీవీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయపెట్టి, అధికారాన్ని ఉపయోగించి, కోట్లాదిరూపాయల డబ్బులు కుమ్మరించి నంద్యాలలో గెలిచినంత మాత్రాన అధికారపార్టీ వాపును చూసి బలుపుగా అనుకుంటుందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పాలన కావాలని జనం వేచిచూస్తున్నారని, ఇది జరిగి తీరుతుందని చెప్పారు. 
Back to Top