విభజన అడ్డుకోకపోతే అందరికీ గడ్డు స్థితే

లక్నో :

అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏ రాష్ట్ర విభజన అంశాన్నయినా ఢిల్లీ చేతికి అప్పగిస్తే అనేక అనర్ధాలకు దారితీసే ప్రమాదం ఉందని, ఇతర ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం మంచి సాంప్రదాయం కాదని శ్రీ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.‌ రాష్ట్ర విభజన అంశంపై సమాజ్‌వాది నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాద‌వ్ మద్దతు కోరేందుకు వచ్చానని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 సవరణ గురించి తాము చర్చించామని ‌ఆయన తెలిపారు.

విభజన అంశానికి వ్యతిరేకంగా తాము వెల్లడించిన అభిప్రాయాలకు అఖిలేశ్ మద్దతించినందుకు శ్రీ జగన్ ధన్యవాదాలు ‌చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో ప్రారంభమైన అడ్డగోలు విభజన అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది అని శ్రీ జగన్ హెచ్చరించారు. అసెంబ్లీ తీర్మానం చేయకుండా ఓ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కకూ విభజనను అడ్డుకోవడానికి ముందుకు రావాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే అంశంపై బీజేపీ, తృణమూ‌ల్ కాంగ్రె‌స్ పార్టీలతో‌ పాటు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాం అని శ్రీ జగన్ తెలిపారు.

తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం - అఖిలే‌శ్ యాద‌వ్‌ :
చిన్న రాష్ట్రాలకు సమా‏జ్‌వాది పార్టీ వ్యతిరేకం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే‌శ్ యాద‌వ్ స్పష్టం చేశారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకం అని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం అని ఆయన అన్నారు.

యూపీ నుంచి ఉత్తరాంచల్ విడిపోయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చిన్న రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం కావు‌ అని ఆయన అభిప్రాయపడ్డారు.‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో సుదీర్ఘ అనుబంధం ఉంది అని.. రాజకీయాలకు అతీతంగా మా స్నేహం కొనసాగుతుంది అఖిలేశ్ అన్నారు.‌

Back to Top