యుద్ధంలో సైనికుల్లా పోరాడాలి

హైదరాబాద్:

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో యుద్ధంలో సైనికుల వలే పోరాడాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఓ‌లూ కీలకమే అని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయరాదని ఆమె సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రేణులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మొదటిరోజు మంగళవారం శ్రీమతి విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీజీసీ సభ్యులు, సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. పలువురు సీనియర్ నేతలు ప్రసంగించారు.

రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులందరూ ఒక ప్రణాళిక రూపొందించుకొని, దానికి అనుగుణంగా పనిచేసిందీ లేనిది ఆ రోజు రాత్రికి మననం చేసుకోవాలని శ్రీమతి విజయమ్మ సూచించారుఎ. చిన్న చిన్న విషయాలను పక్కకు పెట్టి అనుబంధ సంస్థలన్నింటితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పార్టీపై చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. పార్టీ ప్లీనరీలో శ్రీ జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారనే నమ్మకం, ధైర్యం ప్రజల్లో ఉంది కాబట్టి వాటిని మరింతగా గుర్తుచేయా‌లన్నారు. మాట తప్పడమంటే ప్రాణం పోవడంతో సమానమని భావించే మహానేత వైయస్ఆర్ కుమారుడిగా‌ శ్రీ జగన్ కూడా అవే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడ్డా‌రని చెప్పారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధ్యక్షుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారని, అయితే ఆయనను ప్రజలెవ్వరూ నమ్మడం లేదని శ్రీమతి విజయమ్మ తెలిపారు. చంద్రబాబు వెయ్యి ఇస్తానన్నా, రెండు వేలఇస్తానన్నా నమ్మడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన తప్పిదాలన్నీ ప్రజల ముందు పదేపదే ప్రస్తావించాలని సూచించారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను కూడా పార్టీ శ్రేణులంతా గ్రామాల్లో వివరించం‌డని చెప్పారు.

ఎన్టీఆర్ హయాంలో గాని, రాజశేఖరరెడ్డి ఉన్నపుడు గాని ప్రాంతీయ ఉద్యమాలు లేని వైనాన్ని ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. మహానేత వైయస్ఆర్ ‌మరణించిన తరువాత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా, బలమైన రాష్ట్రంగా ఉండి అభివృద్ధి చెందాలని రాజశేఖరరెడ్డి అభిప్రాయపడేవారు. ఆయన ఆశయాలను రెండు ప్రాంతాల్లోనూ సాధించుకుందామని పిలుపునిచ్చారు. రెండు ప్రాంతాల్లోనూ ఎన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకుంటే జాతీయ స్థాయిలో పార్టీకి అంత విలువ పెరుగుతుందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు.

తెలంగాణ సోదరులు అధైర్యపడొద్దదని, ఇటీవల వెలువడిన సర్వేలలో రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అని సీమాంధ్రలో 53 శాతం మంది చెప్పగా, తెలంగాణలో 63 శాతం  అనుకూలంగా చెప్పారని అన్నారు. ప్రాంతాల తేడా వద్దని, తెలుగువారందరూ ఒక్కటే అన్నారు.  'మేం కేవలం తెలంగాణ నినాదం మీదనే పోరాడుతున్నాం తప్ప,  అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాకంటే కూడా ప్రజల్లో మీకే ఎక్కువ ఆదరణ ఉంద’ని నాకు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు తారసపడినప్పుడు చెబుతుండేవారన్నారు. అందుకే పార్టీలోని తెలంగాణ నాయకులు మరింత ధైర్యంగా పోరాడండని సూచించారు. మీ అందరి వెంట మేం అండగా ఉంటామన్నారు. ‌తాను, శ్రీ జగన్, శ్రీమతి షర్మిల ముగ్గురం కూడా ప్రతీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.

వైయస్ఆర్‌సీపీ కష్టాల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ అని టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బయటా పోరాడా‌మన్నారు. పార్లమెంటులో కూడా అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయి విభజన బిల్లును ఆమోదింప జేసుకున్నాయని విమర్శించారు. విభజన బిల్లు పార్లమెంటులో వచ్చినపుడు మన రాష్ట్ర ఎంపీలు తమ స్థానాల్లో నుంచి లేవకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఏఐడీఎంకే, తృణమూల్ ఎంపీలు చివరికంటా ప్రతిఘటించా‌రని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. వైయస్ఆర్‌సీపీకి ప్రజా బలం ఉన్నా తగినంత మంది ఎంపీల బలం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ శాయశక్తులా పోరాటం చేశామని తెలిపారు.
రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. సీమాంధ్రకు రాజధాని ఎక్కడో కూడా చెప్పకుండా చేశారని అన్నారు. విభజన వల్ల ఈ ప్రాంతంలో ఉత్పన్నమయ్యే లోటును ఎక్కడి నుంచి పూరిస్తారో కూడా చెప్పలేదన్నారు.

Back to Top