బాబు మనీల్యాండరింగ్ కు సింగపూర్ సెంటర్

  • రాజధాని రైతులకు ఇచ్చిన హామీల అమలులో విఫలం
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సింగపూర్ డ్రామా
  • రైతులను సింగపూర్ పంపిస్తే కడుపు నిండుతుందా బాబూ..?
  • భూములు కోల్పోయిన రైతులకు పలానా చేశానని చెప్పే ధైర్యం ఉందా..?
  • అమరావతిని సింగపూర్ కు రాజధాని అని ప్రకటిస్తాడేమో..?
  • బాబు జీవితమంతా తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వరు
  • కళ్లబొల్లి వ్యవహారం కట్టబెట్టి..రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ 
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబు సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఫ్లైటు ఎక్కించి సింగపూర్ చూసి రమ్మనడమేంటని ప్రశ్నించారు. ఇదేం వెర్రిబాగుల ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. ఓ సినిమాలో కోడిని వేలాడగట్టుకొని కోడికూర తిన్నట్టుగా ఊహించుకున్న చందాన...రైతులను సింగపూర్ లో తిప్పి ఇదే అమరావతి అని ఊహించుకొమ్మనడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అసలే  భూములు కోల్పోయి, ఉద్యోగం లేక, ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వకపోవడంతో 29 గ్రామాల రైతులు నరకయాతన అనుభవిస్తుంటే...అవేమీ పట్టించుకోకుండా సింగపూర్ పేరుతో బాబు రైతులను మభ్యపెట్టడం దారుణమన్నారు.  రైతులను బస్సు, ఫ్లైటు ఎక్కించి సింగపూర్ చూసి రమ్మనడం, ఖర్చంతా ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పడం ఈ పాట్లన్నీ దేనికని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం మీరు శంకుస్థాపన చేసిన అమరావతిలో ఒక్క ఇటుకైనా కట్టి నిర్మాణం మొదలుపెట్టి ఉంటే ఇవాళ 34మంది రైతులను బుజ్జగించాల్సిన పని వచ్చేది కాదు కదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  బాబు మాటలు నమ్మి భూసేకరణకు రైతులు 34వేల ఎకరాలు ఇస్తే... బాబు మాత్రం తన రియల్ ఎస్టేట్ సినిమా చూసిరమ్మని వేయి ఎకరాల చొప్పున 34మందిని సింగపూర్ చూడడానికి బస్సెక్కించాడన్నారు. అసంతృప్తితో ఉన్న రైతులను సింగపూర్ పేరుతో ఆయింట్ మెంట్ రాసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పంటలు పండే 34వేల ఎకరాలు జరీబు భూములను తీసుకున్నప్పుడు ఇలాంటి విలువగల భూములనే ఇస్తామని చెప్పారు. ఇవాళ అవి  రైతులకు ఇచ్చారా..? బెదిరించకుండా, పోలీసుల సహాయం లేకుండా రైతుల వద్దకెళ్లి వారి మధ్యలో నిలబడి నేను రైతులకు ఇది చేశాను, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చానని చెప్పే ధైర్యం చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేశామని చెప్పే ధైర్యం ఉందా..? అని నిలదీశారు. బాబు తన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు  సింగపూర్ చూసి రండి, అమరావతి గురించి కలలు కనండి అనే దుస్థితికి వెళ్లాడని పద్మ ఫైర్ అయ్యారు. సీఆర్డీఏ సమావేశాల్లో పోలీసు అధికారాన్ని ప్రయోగించి రైతులను ఏనాడు మాట్లాడనీయకుండా చేశారు. 29 గ్రామాల రైతుల పక్షాన మేం అడుగుతున్నాం.  ఇప్పటిదాక కాగితాల మీద తప్ప ఇవి మీ ప్లాట్లు అని రైతులకు చూపించిన పరిస్థితి ఉందా అని చంద్రబాబును కడిగిపారేశారు. భూములిచ్చిన రైతుల ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఓ పక్క భూములు కోల్పోయి, మరో పక్క ఉద్యోగం లేక, ప్లాట్లు ఎక్కడ ఇస్తారో తెలియక రైతులు నిరాశలోఉన్నారు. మీరు సింగపూర్ చూపిస్తామంటే వారి కడుపు నిండుతుందా..?ఇంత అన్యాయం చేస్తారా..? అని బాబుపై పద్మ నిప్పులు చెరిగారు. 

రైతులు ఆర్థికంగా బలహీనులయితే దానికి సమాధానం చెప్పకుండా సింగపూర్ చూపిస్తామనడం దారుణం. రైతులు స్థలమిచ్చి రాజధాని నిర్మాణం చేయమంటే చేయకుండా,  కేంద్రం ఇచ్చిన నిధుల్నికూడ దారి మళ్లించి మింగేశారు.  ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతుంటే సమాధానం లేదు. రైతుల భూములకు ప్లాట్లు కూడ చూపించడం లేదు. రైతు కూలీలకు ఇచ్చే పింఛన్ కూడ సరిగా ఇవ్వడం లేదు.  అంతర్జాతీయ వేదికల మీద గొప్పలు చెప్పుకునే మీరు రైతులకు తిరిగి ఏమి ఇచ్చారు బాబు అని పద్మ ప్రశ్నలు సంధించారు. తీసుకోవడమే తప్ప బాబు జీవితమంతా తిరిగి ఇవ్వడం తెలియదేమోనని ఎధ్దేవా చేశారు. బాబు మీరు, మీ కొడుకు , మంత్రులు ఎప్పుడైనా సెంటు భూమును ఇచ్చారా...? అలా ఇచ్చి ఉంటే రైతుల బాధలేంటో తెలిసేవన్నారు.  బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని పద్మ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా లేక కాశీపట్నం చూడర బాబు అని గారడీవాడో అర్థం కావడం లేదన్నారు.  మూడున్నరేళ్ల తర్వాత కూడ రాజధాని నిర్మాణం లేదు. రైతులకు ఇచ్చిన మాట ఒక్కటి కూడ అమలు జరగడం లేదు. రుణమాఫీ, ఇంటికోఉద్యోగం, నెలనెల పెన్షన్ అన్నారు. కమర్షియల్ ప్లాట్లు అన్నారు. అవేమీ చేయకుండా రైతుల అసంతృప్తిని గమనించి సింగపూర్ ను చూపిస్తే వారు మాట్లాడకుండా ఉంటారని బాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.

 సింగపూర్ మీద బాబు తనకున్న మోజూ ఏపాటిదో అందరికీ తెలుసునన్నారు. కానీ, దాన్ని రైతులపై చూపించొద్దని హెచ్చరించారు. బాబు మనీ ల్యాండరింగ్ కు సింగపూర్ ఓ సెంటర్ అని పద్మ ఆరోపించారు. బాబు  పరివారం అంతా అక్కడ ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. రాను రాను బాబు అమరావతిని సింగపూర్ రాజధాని అని ప్రకటిస్తాడేమోనని వాసిరెడ్డి పద్మ అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కట్టలేక బాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజమౌళిని, రైతులను ఉపయోగించుకుంటున్నాడన్నారు. రైతులంటే బాబుకెంత చులకనభావమో అర్థమవుతోందన్నారు. వ్యవసాయం దండగ అన్నబాబు రైతులకు ఏం చేస్తాడని ఆశిస్తామన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఏపీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని పద్మ ఫైర్ అయ్యారు. కళ్లబొల్లి వ్యవహారాలు కట్టిబెట్టి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి రాజాపై ఎస్సై చేసిన దాష్టీకంపై మండిపడ్డారు. కారు పార్కు చేసినందుకు ఈడ్చి, చొక్కాలు పట్టుకొని లాఠీలతో కొడతారా..? బాబు అండతోనే ఈవిధంగా జరుగుతోందన్నారు. దీనిపై విచారణ జరగాలన్నారు. 
Back to Top